Ramoji Rao : ఉగాది రోజు ఈనాడు గ్రూపు సంస్థల అధిపతి రామోజీరావుకు గట్టి షాక్ తగిలింది. మార్గదర్శికి సంబంధించి గతంలో ఉమ్మడి హైకోర్టు వెలువరించిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది. మార్గదర్శి డిపాజిట్లపై కచ్చితంగా పరిశీలన జరగాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అంతేకాదు అందులో ఉన్న నిజాలు మొత్తం బయటికి వెల్లడించాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. మార్గదర్శి డిపాజిట్ల కేసును రిఫర్ చేసింది. మార్గదర్శి లో అవకతవకలు జరిగాయని దాఖలైన పిటిషన్ కు సంబంధించి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విశ్వనాథన్ తో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ నిర్వహించింది. ఈ సందర్భంగా గత వాదనలను ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది. ” మార్గదర్శిలో దాఖలైన డిపాజిట్లపై కచ్చితంగా పరిశీలన జరగాల్సిందే. బహిరంగ ప్రకటన ఇచ్చి.. ఎవరికైనా డబ్బు తిరిగి ఇవ్వలేదా? అనే విషయాన్ని కచ్చితంగా తెలుసుకోవాలి. దీనికిగానూ హైకోర్మాటు జీ న్యాయమూర్తి ని ఒకరిని నియమించాలి. ఆంధ్రప్రదేశ్ లో డిపాజిటర్లున్నారు కాబట్టి మేము అనుమతి ఇచ్చాం. మేము కేసు మెరిట్స్ లోకి ప్రవేశించడం లేదు. ఈ కేసును తెలంగాణ హైకోర్టుకు రిఫర్ చేస్తున్నాం. రెండు లేదా మూడు నెలల్లో డిపాజిట్లపై సమగ్ర పరిశీలన జరపాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఈ వ్యవహారాన్ని పర్యవేక్షించాలి. మార్గదర్శిపై కేసు వేసిన ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా హైకోర్టుకు సహకరించాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ కేసులో కచ్చితంగా తమ వాదనలు వినిపించాలి. ఆరు నెలల్లో ఈ కేసు విచారణను తెలంగాణ హైకోర్టు పూర్తి చేయాలి. ఈ కేసు కు సంబంధించి మేము ఎటువంటి వ్యాఖ్యలు చేయబోం. తదుపరి ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలంగాణ హైకోర్టులో వాదనలు వినిపించండి” అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం తన తీర్పులో ప్రకటించింది.
ఏమిటి ఈ కేసు నేపథ్యం
మార్గదర్శి అక్రమంగా 2300 కోట్ల డిపాజిట్లు సేకరించిందనేది ప్రధాన అభియోగం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం 1934 లోని సెక్షన్ 45 (ఎస్) నిబంధన ఉల్లంఘించారని 2006లో ఉండవల్లి అరుణ్ కుమార్ అప్పట్లో ఒక ఫిర్యాదు దాఖలు చేశారు. దీనిపై అప్పటి ఏపీ ప్రభుత్వం స్పందించింది. మార్గదర్శిపై చర్యలకు గానూ ఒక ప్రత్యేక అధికారిని నియమించింది.
ఈ క్రమంలో 2008లో ప్రభుత్వం తరఫున ఫిర్యాదు దాఖలు కాగానే.. దానిని కొట్టివేయాలంటూ పది సంవత్సరాల తర్వాత మార్గదర్శి సంస్థ ఇరు రాష్ట్రాల హైకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో 2018 డిసెంబర్ 31న మార్గదర్శి పై క్రిమినల్ కేసును అప్పటి హైకోర్టు కొట్టి వేసింది.. ఈ కేసు కు సంబంధించి చట్టాన్ని తప్పుదోవ పట్టించారని, మార్గదర్శిపై ఉన్న కేసును కొట్టివేశారని, ఆ క్రిమినల్ కేసుకు పై హైకోర్టు ఇచ్చిన తీర్పును మరొకసారి సమీక్షించాలని 2019లో ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అంతేకాదు ఆయన స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో అటు ఏపీ, ఇటు తెలంగాణ ప్రభుత్వాలను భాగస్వామ్యాలు చేయాలని ఆయన కోరారు. ఇక అప్పటినుంచి దీనిపై విచారణ కొనసాగుతూనే ఉంది.
రిజర్వ్ బ్యాంక్ ఏం చెప్పిందంటే..
ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన ఫిర్యాదు నేపథ్యంలో ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు విచారణ నిర్వహించింది. ఈ సందర్భంగా మార్గదర్శి చట్ట విరుద్ధంగా డిపాజిట్లు సేకరించిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు ఎదుట స్పష్టం చేసింది. సెక్షన్ 45 – ఎస్ కు వ్యతిరేకంగా డిపాజిట్లు సేకరించడం సరికాదని.. మార్గదర్శి ఇదేవిధంగా డిపాజిట్లు సేకరించిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. ఇక ఈ కేసుకు సంబంధించి కోర్టులో విచారణ జరుగుతుండగానే అదనంగా మార్గదర్శి మరో రెండు వేల కోట్లు వసూలు చేసిందని.. మొత్తం 4,600 కోట్ల డిపాజిట్లు మార్గదర్శి ప్రజల నుంచి వసూలు చేసిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది.. మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శి కి వ్యతిరేకంగా మాట్లాడటంతో.. ఈ కేసు వేసిన ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. మార్గదర్శి రూపంలో రామోజీరావు ఆర్థిక నేరాలకు పాల్పడినట్టు స్పష్టమైందని అన్నారు. డిపాజిట్లు వెనక్కి ఇచ్చారా? లేదా? అనేది ఇక్కడ విషయం కాదని.. చట్ట విరుద్ధంగా సేకరించారా? లేదా? అనేదే పరిగణలోకి తీసుకోవాల్సిన విషయమని అరుణ్ కుమార్ సుప్రీంకోర్టులో వాదించారు. అప్పట్లో ఆయన వాదనలు విని సుప్రీంకోర్టు ఏకీభవించింది. ఈ కేసు పూర్వాపరాలను పరిశీలించి మంగళవారం పై విధంగా తీర్పు ఇచ్చింది. ఇక సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మార్గదర్శి భవితవ్యం మరింత ప్రమాదంలో పడినట్టు తెలుస్తోంది. సుప్రీంకోర్టులో ద్వారాలు ముగుసుకుపోవడంతో.. మార్గదర్శి యజమాని రామోజీరావు ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read More