AP Congress: సినీ పరిశ్రమ నుంచి ఈసారి ఎన్నికల్లో చాలా తక్కువ మంది పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి నందమూరి బాలకృష్ణ, వైసీపీ నుంచి మంత్రి ఆర్కే రోజా, జనసేన నుంచి పవన్ కళ్యాణ్ మాత్రమే బరిలో దిగారు. జనసేనకు స్టార్ క్యాంపెయినర్లుగా జబర్దస్త్ నటులు హైపర్ ఆది, గెటప్ శీను, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, మెగా బ్రదర్ నాగబాబులు ప్రచారం చేయనున్నారు. అటు వైసిపి మద్దతుదారులుగా పోసాని కృష్ణ మురళి, అలీలు మాత్రమే కనిపిస్తున్నారు. అయితే ఇందులో అలీ ప్రచారానికి వస్తారా? లేదా? అన్నది తెలియడం లేదు. ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ ప్రకారం సినీ పరిశ్రమ నుంచి పోటీ చేస్తున్నది ముగ్గురే. ప్రచారం చేయనున్నది పదిమందిలోపే. అయితే ఇటువంటి తరుణంలోనే కాంగ్రెస్ పార్టీ కీలక ప్రకటన చేసింది. విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి ఒక నిర్మాతను అభ్యర్థిగా ప్రకటించింది.
ఏపీలో విశాఖ లోక్సభ స్థానం కీలకం. వైసీపీ నుంచి బొత్స ఝాన్సీ లక్ష్మి, టిడిపి నుంచి భరత్ పోటీ చేస్తున్నారు. ఇరు పార్టీల నుంచి హేమాహేమీ నాయకుల పేర్లు వినిపించినా.. ఈ స్థానం పొత్తులో భాగంగా బిజెపికి వెళ్తుందని ప్రచారం జరిగినా.. వాటన్నింటిని తెరదించుతూ తెలుగుదేశం పార్టీకే ఈ స్థానాన్ని కేటాయించారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా టీ సుబ్బిరామిరెడ్డి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ కాంగ్రెస్ హై కమాండ్ మాత్రం సత్యారెడ్డి అనే అభ్యర్థిని ప్రకటించింది. ఈయన సినీ నిర్మాత కూడా. ఇప్పటివరకు 53 చిత్రాలను రూపొందించారు. గుంటూరు జిల్లాకు చెందిన సత్యారెడ్డి ఎప్పుడో విశాఖకు వచ్చి స్థిరపడ్డారు. ఆయన స్థానికంగా సుపరిచితం. స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో కూడా భాగస్వామ్యం అయ్యారు. దీంతో కలిసి వస్తుందని భావించి కాంగ్రెస్ హై కమాండ్ సత్యారెడ్డికి టిక్కెట్ ఇచ్చింది.వైసీపీ నుంచి బయటకు వచ్చిన కొయ్య ప్రసాద్ రెడ్డి ఈ టిక్కెట్ ఆశించినా.. కాంగ్రెస్ హై కమాండ్ మాత్రం.. సత్యారెడ్డి వైపే మొగ్గు చూపింది.
ఇప్పటివరకు సినీ పరిశ్రమ నుంచి పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. గతంలో మురళీమోహన్, అశ్వినిదత్ తదితర సినీ సెలబ్రిటీల సందడి కనిపించేది. కానీ ఈసారి అటువంటిదేమీ లేకుండా పోయింది. అయితే అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ నిర్మాత సత్యారెడ్డిని పోటీలో దించడం చర్చనీయాంశంగా మారింది. సత్యారెడ్డి తొలుత తెలుగు సేన అనే పార్టీని ప్రకటించారు. ప్రస్తుతం ఆయన ఉక్కు సత్యాగ్రహం అనే సినిమాను రూపొందిస్తున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను ఇతివృత్తంగా తీసుకొని… కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సినిమాను రూపొందిస్తున్నారు. స్థానిక కళాకారులతో తీస్తున్న ఈ చిత్రంలో అనే ప్రధాన నటుడు. నిర్మాతగానే కాకుండా దర్శకుడిగా కూడా బాధ్యత వహించారు. తెలంగాణకు చెందిన విప్లవ కళాకారుడు గద్దర్ కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నారు. దీంతో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్న సత్యారెడ్డి అయితే బాగుంటుందన్న నిర్ణయానికి వచ్చిన కాంగ్రెస్ హై కమాండ్ ఆయనకు టికెట్ ఖరారు చేసింది. అయితే సినీ పరిశ్రమ నుంచి టికెట్ దక్కించుకోవడం హాట్ టాపిక్ గా మారింది. అసలు సత్యారెడ్డి ఎవరు? అని అందరూ ఆరా తీయడం ప్రారంభించారు.