Chandrababu: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫీవర్ నడుస్తోంది. తెలుగు రాష్ట్రాలకు తాకింది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పొలిటికల్ హీట్ పతాక స్థాయికి చేరింది. ఈ తరుణంలో సమీకరణలు మారుతున్నాయి. పార్టీలు ఏ చిన్న అవకాశాన్ని విడిచిపెట్టడం లేదు. ముఖ్యంగా తెలంగాణ ప్రభావం ఏపీ ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఇది కొత్త కాదు. 2019 ఎన్నికల్లో కూడా తెలంగాణ అంశాలు దోహదపడ్డాయి. అక్కడి నుంచి కెసిఆర్ సహకారం అందుకోవడంలో జగన్ సక్సెస్ అయ్యారు. ఇప్పుడు కెసిఆర్ దిగిపోయి రేవంత్ వచ్చారు. చంద్రబాబు శిష్యుడు కావడంతో తెలంగాణ నుంచి చంద్రబాబుకు సంపూర్ణ సహకారం అందుతుందని అంతా భావిస్తున్నారు. కానీ రేవంత్ ఇచ్చిన హామీల ప్రభావం చంద్రబాబుపై పడుతోంది.
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. దానికి కారణం సూపర్ సిక్స్ పథకాలు. అవే సూపర్ సిక్స్ పథకాలను తెలంగాణలో అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. రైతుబంధు, ధాన్యం సేకరణ, మహిళలకు 1500 రూపాయల నగదు వంటివి ఈ పథకాల్లో కీలకమైనవి. అయితే తెలంగాణలో రేవంత్ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్నా వాటిని అమలు చేయలేకపోయారు. కనీసం ప్రారంభించలేకపోయారు. దీంతో అక్కడ ఇబ్బందికర పరిణామాలు ఎదురవుతున్నాయి. పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన సూపర్ సిక్స్ పథకాలను చంద్రబాబు నమ్ముకున్నారు. రేవంత్ ఏ హామీలు ఇచ్చారో.. అవే హామీలను చంద్రబాబు కూడా ప్రజలకు ఇస్తున్నారు. అయితే రేవంత్ చంద్రబాబు శిష్యుడు కావడం, ఆ పథకాలు అమలు చేయకపోవడంతో చంద్రబాబుపై అపనమ్మకం ఏర్పడుతోంది. 2014 ఎన్నికల్లో కూడా చంద్రబాబు చాలా రకాల హామీలు ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక బుట్ట దాఖలు చేశారు. సంక్షేమం విషయంలో చంద్రబాబు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని ఇస్తారన్న అపవాదు ఉంది. దీంతో ఇప్పుడు సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించినా ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఒకవేళ తెలంగాణలో రేవంత్ రెడ్డి సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసి ఉంటే.. చంద్రబాబు కూడా వెనువెంటనే ప్రారంభిస్తారు అన్న నమ్మకం ప్రజల్లో ఉండేది. పైగా ఏపీ కంటే తెలంగాణ ఆర్థికంగా వృద్ధి చెందిన రాష్ట్రం. అక్కడే అమలు చేయకపోతే.. ఏపీలో ఎలా అమలు చేస్తారులే అన్న నిర్ణయానికి ప్రజలు వస్తారు. సూపర్ సిక్స్ పథకాలను నమ్మేస్థితిలో ఉండరు. ఒక విధంగా చెప్పాలంటే రేవంత్ ను నమ్ముకుంటే చంద్రబాబుకు ఇబ్బందికర పరిస్థితులే. అందుకే సూపర్ సిక్స్ పథకాల అమలు విషయంలో మరింత స్పష్టత ఇవ్వాల్సిన అవసరం చంద్రబాబుపై ఉంది.