CM Revanth Reddy
CM Revanth Reddy: పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. ఏడు విడతల్లో ఐదు రాష్ట్రాలతోపాటు లోక్సభ ఎన్నికలు ఏడు విడతల్లో నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఏప్రిల్ 18 నుంచి జూన్ 1వ తేదీ వరకు ఎన్నికలు జరుగనున్నాయి. జూన్ 4న ఫలితాలు ప్రకటిస్తారు. ఇక ఏపీలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు, తెలంగాణలో లోక్సభ ఎన్నికలు మే 13న జరుగనున్నాయి. ఈమేరకు రెండు రాష్ట్రాల పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ప్రచారం మొదలు పెట్టాయి.
అసెంబ్లీ ఎన్నికల జోష్ కొనసాగించాలని..
ఇక తెలంగాణలో డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల జోష్ను పార్లమెంటు ఎన్నికల్లో కూడా కొనసాగించాలని సీఎం రేవంత్రెడ్డి భావిస్తున్నారు. ఈ క్రమంలో పార్టీల్లో చేరికలను ప్రోత్సహిస్తున్నారు. మరోవైపు క్యాడర్ను సమాయత్తం చేసేందుకు జిల్లాల వారీగా మీటింగ్లు నిర్వహిస్తున్నారు.
మాట తుళ్లిన రేవంత్..
ఇక సీఎం రేవంత్రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసేందుకు మార్చి 28న కొడంగల్ వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడి నాయకులతోసమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల్లో వంశీచందర్రెడ్డిని పార్లమెంటుకు పంపించాలని కోరారు. పోలింగ్ శాతం పెంచేందుకు జిల్లా నుంచి ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన ఓటర్లను రప్పించాలని నాయకులకు సూచించారు. అక్కడ ఓటు ఉన్నా.. ఇక్కడ కూడా ఓటు వేసేలా చూడాలని ఆదేశించారు. వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు తేదీల్లో ఎన్నికలు ఉన్నందున, ఇక్కడ ఓటేసి, తర్వాత అక్కడ ఓటేసేలా చూడాలని అర్థం వచ్చేలా మాట్లాడారు. దీనికి సబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సీఎం స్థాయిలో ఉండి..
ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి రేవంత్రెడ్డి ఎన్నికల్లో ఓటర్లు రెండు ఓట్లు వేసేలా చూడాలని మాట్లాడడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పొరపాటున అన్నారా.. తొందర పాటులో అన్నారా తెలియదు కానీ ఆయన వ్యాఖ్యలను మాత్రం ట్రోల్ చేస్తున్నారు. దీనిపై పొలిటికల్ ఎక్స్పర్ట్స్ కూడా స్పందిస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో జాగ్రత్తగా మాట్లాడాలని సూచిస్తున్నారు.