Bhogapuram International Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధం అయ్యింది. ఈ నూతన విమానాశ్రయాన్ని జూలై 5న ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రారంభ తేదీపై ఇంకా స్పష్టత రాలేదు కానీ.. ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు మాత్రం శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం. ప్రధాని నరేంద్ర మోడీ చేతులమీదుగా ఈ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మొన్ననే సీఎం చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీతో కూడా చర్చించినట్లు తెలుస్తోంది. ప్రైవేటు ఎయిర్లైన్స్ కు సంబంధించిన కార్యకలాపాలు జూలై మొదటి వారం నుంచి ప్రారంభించేందుకు నిర్ణయించారు. ఇకపై విశాఖ ఎయిర్పోర్టులో బదులు భోగాపురం విమానాశ్రయంలో తమ కార్యాలయం సేవలు అందుబాటులోకి వస్తాయని పలు ప్రైవేటు విమానయాన సంస్థలు ప్రత్యేక ప్రకటనలు చేశాయి.
* పనులు తుది దశకు..
విజయనగరం జిల్లాలో నిర్మించిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు తుది దశకు చేరుకున్నాయి. నెలల కిందట ప్రధాన పనులు జరగడంతో రాయల్ రన్ కూడా జరిగింది. ఢిల్లీ నుంచి వచ్చిన తొలి ఎయిర్ ఇండియా వాలిడేషన్ ఫ్లైట్ భోగాపురం విమానాశ్రయం రన్ వే పై దిగింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భారీ విమానాలు కూడా ల్యాండ్ అయ్యేలా భోగాపురం ఎయిర్పోర్ట్ రన్ వేను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ ట్రయల్ రన్ విజయంతో రన్ వే సామర్థ్యం, భద్రత ప్రమాణాలపై అధికారులకు ఒక స్పష్టమైన అవగాహన వచ్చింది. దాదాపు పెండింగ్ పనులన్నీ తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది.
* ఉత్తరాంధ్ర ప్రజల కల..
రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా ఈ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించారు. ఈ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తే విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలకు మాత్రమే కాకుండా ఒడిస్సా సరిహద్దు ప్రాంతాలకు కూడా ఇది ప్రధాన విమాన కేంద్రంగా మారనుంది. ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలకు విశాఖపట్నం ఉన్న విమాన ప్రయాణ భారం తగ్గడంతో పాటు.. ఈ అంతర్జాతీయ విమానాశ్రయం తో ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన విమాన సేవలు లభించునున్నాయి. ప్రస్తుతం ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు తుది దశకు చేరుకోవడంతో సందర్శకులతో కిటకిటలాడుతోంది. విశాఖకు వచ్చే పర్యాటకులు సైతం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రద్దీగా మారడం విశేషం.
