Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం జరిగింది ఈ రోజు. ఉత్తరాంధ్రకు గేమ్ చేంజర్ గా నిలిచే ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని ఒక వేడుకలా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేసింది. భారీగా జన సమీకరణ చేసింది. ఉత్తరాంధ్రతో పాటు గోదావరి జిల్లాల నుంచి జనాలు తరలి వచ్చారు. అయితే అంచనాలకు మించి జనాలు రావడం విశేషం. పెద్ద ఎత్తున ప్రచారం కావడంతోనే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారు. వారి ఆసక్తిని గమనించిన ప్రభుత్వం బస్సులను ఏర్పాటు చేయడంతో వారిలో ఉత్సాహం మిన్నంటినట్లు స్పష్టం అవుతోంది. కేవలం ఇది ఒక ప్రయాణ కేంద్రం మాత్రమే కాదు. ఉత్తరాంధ్ర ఆర్థిక అభివృద్ధిని నిర్దేశించేది అని తెలియడంతో సామాన్యుడు సైతం చూసేందుకు పెద్ద ఎత్తున ఆసక్తి కనబరిచారు. ప్రారంభోత్సవంలో భాగస్వామ్యం కావాలని అనుకున్నారు. అందుకే రెండు లక్షల మంది హాజరవుతారని అంచనా వేయగా.. అంతకుమించి పాల్గొనడం విశేషం.
* అంచనాలకు మించి..
ప్రధానంగా ఉత్తరాంధ్రలోని ఉమ్మడి జిల్లాల నుంచి భారీగా జనాలు తరలి వస్తారని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే అంచనాలకు మించి ప్రజలు రావడంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. ప్రాథమిక సమాచారం మేరకు మూడున్నర లక్షల మంది హాజరైనట్లు తెలుస్తోంది. శనివారం వేకువ జాము నుంచి వాహన తాకిడి పెరిగింది. గంట గంటకు పెరుగుతూ.. తొలుత వందలుగా భావించిన వాహనాలు వేలకు చేరుకున్నాయి. మధ్యాహ్ననికి విశ్వరూపం కనిపించింది. ఎటు చూసినా జనమే జనం. అలా లక్షలు పోగయ్యేసరికి మనుషులు చీమలుగా మారిపోయారు. అంతలా జనతాకిడి పెరిగింది. జనాన్ని చూసి నేతలు, ప్రజా ప్రతినిధులు రెట్టింపు ఉత్సాహంతో సమన్వయం చేసుకోవడం ప్రారంభించారు. దీంతో ప్రధాని సభ మరింత విజయవంతం అయింది.
* కూటమిలో ఖుషి..
ఉత్తరాంధ్రతో పాటు గోదావరి జిల్లాల నుంచి భారీగా జనం తరలింపునకు నిర్ణయించింది ప్రభుత్వం. ఏకంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. ఏపీఎస్ఆర్టీసీ తో పాటు ప్రైవేటు వాహనాలను సైతం వినియోగించుకుంది. ప్రతి గ్రామానికి వాహనం ఏర్పాటు జరిగింది. ఇలా 5000 వరకు వాహనాలు ఏర్పాటు చేయడంతో ప్రజలు స్వచ్ఛందంగా కదిలారు. మరోవైపు ప్రజలు ప్రారంభోత్సవ సభకు అనువుగా వచ్చేందుకు వీలుగా ప్రాంతాలవారీగా పార్కింగ్ కేంద్రాలను సైతం ఏర్పాటు చేశారు. ఏ జిల్లా నుంచి వచ్చిన వారికి ఆ జిల్లాకు పార్కింగ్ కేంద్రాలను కేటాయించడం విశేషం. అయితే కేవలం రెండు లక్షల మంది హాజరవుతారని అంచనా వేసుకోగా.. ఏకంగా రెట్టింపు స్థాయిలో హాజరు కావడం మాత్రం కూటమి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం సక్సెస్ కావడంతో మూడు పార్టీల నేతల్లో సంతృప్తి కనిపిస్తోంది.