Pawan Kalyan (1)
Pawan Kalyan: ఏపీలో( Andhra Pradesh ) పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సమీపిస్తోంది. ఈనెల 27న పోలింగ్ జరగనుంది. కృష్ణా-గుంటూరు, ఉభయగోదావరి జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. కృష్ణా- గుంటూరు స్థానానికి టిడిపి అభ్యర్థిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ పోటీ చేస్తున్నారు. ఉభయగోదావరి జిల్లాలకు సంబంధించి పేరా బత్తుల రాజశేఖర్ పోటీలో ఉన్నారు. పిడిఎఫ్ అభ్యర్థులు బరిలో ఉండడంతో పోటీ హారాహోరీగా మారింది.
* బరి నుంచి తప్పుకున్న వైయస్సార్ కాంగ్రెస్
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ రెండు చోట్ల అభ్యర్థులను ప్రకటించింది. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పోటీకి దూరమైంది. బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. దీంతో తెలుగుదేశం పార్టీ పిడిఎఫ్ అభ్యర్థులతో తలపడాలని నిర్ణయించింది. మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పిడిఎఫ్ అభ్యర్థులకు మద్దతు తెలపనున్నట్లు తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీలో ఉన్న మాదిరిగానే.. పిడిఎఫ్ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని జగన్మోహన్ రెడ్డి ఆ నాలుగు జిల్లాల నేతలకు పిలుపునిచ్చినట్లు సమాచారం. ఇటీవల పార్టీ నేతలతో సమావేశం అయిన అధినేత జగన్ ప్రత్యేక ఆదేశాలు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
* వైసీపీ గట్టి ప్రయత్నం
ముఖ్యంగా గుంటూరు( Guntur ) జిల్లాలో ఆలపాటి రాజేంద్రప్రసాద్ ను ఓడించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గట్టి ప్రయత్నం లోనే ఉంది. తెలుగుదేశం పార్టీలో సైతం ఆలపాటి రాజా అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన నేతలు చాలామంది ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో టీడీపీ నాయకత్వంలో ఒక రకమైన కలవరం ఉంది. అయితే చంద్రబాబు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. పార్టీ శ్రేణులకు అన్ని రకాల జాగ్రత్తలు చెబుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం జనసేన నేతలను అప్రమత్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై దిశా నిర్దేశం చేశారు.
* పట్టభద్రుడు కాకపోవడంతో
అయితే పవన్ కళ్యాణ్( Pawan Kalyan) పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం లేదు. ఆయన పట్టభద్రుడు కాదు. అందుకే ఓటు వేసేందుకు చాన్స్ లేదు. అయితే సీఎం చంద్రబాబు తో పాటు మంత్రి లోకేష్ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిద్దరూ మంగళగిరి నియోజకవర్గ తాడేపల్లి పరిధిలో ఓటు హక్కు పొందారు. తాడేపల్లి లోని గాదె రామయ్య, సీతారావమ్మ మండల పరిషత్ పాఠశాలల్లో వీరు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి లో నివాసం ఉంటున్న ఆయన ఓటు హక్కు పులివెందులలో ఉంది. దీంతో ఆయన సైతం ఓటు వేసే అవకాశం లేదు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Pawan kalyan is far from voting in mlc elections for graduates
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com