YCP MLAs: ఏపీలో( Andhra Pradesh) రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. గత కొద్ది రోజులుగా అసెంబ్లీకి దూరంగా ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిన్ననే సభకు వచ్చింది. సరిగ్గా 11 నిమిషాల పాటు సభలో ఉండి గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది. అటు తరువాత వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు జగన్ బయటకు వెళ్లిపోయారు. దీనిపై కూటమి ప్రభుత్వం మండిపడుతోంది. స్పీకర్ అయ్యన్నపాత్రుడు సైతం సెటైరికల్ గా వ్యాఖ్యానాలు చేశారు. 11వ తేదీ… 11 మందితో.. 11 నిమిషాల పాటు సభకు హాజరైంది అంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై కామెంట్స్ చేశారు. మరోవైపు అసెంబ్లీలో రిజిస్టర్ సంతకాలకు చెక్ చెప్పారు. డిజిటల్ విధానంలో హాజరు ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 11 నిమిషాల పాటు మాత్రమే సభలో ఉన్న వైసీపీ సభ్యుల హాజరు నమోదు అవుతుందా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. నిన్ననే బడ్జెట్ సమావేశాలకు హాజరై.. రిజిస్టర్ లో సంతకం చేసి.. అంతటితో కథ ముగిసింది అన్నట్టు వైసిపి ఉంది. వచ్చేనెల ఏడు వరకు శాసనసభ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో.. అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చే ఛాన్స్ లేదని తేలిపోయింది.
* రిజిస్టర్లో సంతకాలు కుదరదు..
అయితే ఇప్పుడు స్పీకర్ చెబుతున్నట్టు.. శాసనసభ అధికారులు చెబుతున్నట్టు.. డిజిటల్ హాజరు( digital attendance) విధానం వస్తే ఏంటనే ప్రశ్న వినిపిస్తోంది. డిజిటల్ హాజరు 11 నిమిషాలను పరిగణలోకి తీసుకోకపోతే మాత్రం వైసీపీ సభ్యులపై అనర్హత వేటు పడే అవకాశం ఉంది. అదే జరిగితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ న్యాయ పోరాటం చేయనుంది. కోర్టును ఆశ్రయించనుంది. ఒకవేళ కోర్టు జోక్యం చేసుకోకుండా స్పీకర్ ఆదేశాలకు సమ్మతిస్తే.. వైసీపీ సభ్యులకు ఇబ్బందికరమే. వారిపై అనర్హత వేటు వేస్తే ఉప ఎన్నిక అనివార్యం. అలాగని అనర్హత వేటుపడిన వారు ప్రత్యక్ష ఎన్నికలకు ఆరు సంవత్సరాలు దూరంగా ఉండాలి. అంటే వీరంతా మాజీలు అవుతారు కానీ.. పోటీలో మాత్రం వేరే వారికి పెట్టక తప్పదు.
* ఆరేళ్లు పోటీకి దూరంగా..
ఒకవేళ వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే మాత్రం.. అది ముమ్మాటికీ ఇబ్బందికరమే. ఇప్పుడున్న సంక్లిష్ట పరిస్థితుల్లో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ గెలవడం అంత ఈజీ కాదు. కూటమి ప్రభుత్వం పట్ల సానుకూలత ఉంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పుంజుకోలేదు. తిరుమల లడ్డు వివాదానికి సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై అనేక రకాల విమర్శలు చుట్టుముట్టాయి. గడిచిన 20 నెలల్లో వైసీపీ వెంట ఉండే కొన్ని వర్గాలు సైతం మనసు మార్చుకున్నాయి. ఈ పరిస్థితుల్లో ఉప ఎన్నికలకు వెళ్తే ప్రతికూల ఫలితాలు తప్పవు. అందుకే డిజిటల్ హాజరు అనేసరికి అనేక రకాల అంశాలు చర్చకు వస్తున్నాయి. కూటమి పట్టుదలగా ముందుకు వెళితే వైసీపీ సభ్యులపై అనర్హత వేటు పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ కూటమి అంత దూకుడుగా ముందుకు వెళ్తుందా? లేదా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్.