YCP: జగన్ బెంగుళూరు ఎందుకు వెళ్లారు? పులివెందులలో ఐదు రోజుల పర్యటనను కుదించారు ఎందుకు? అక్కడ ఆయన ఎవరితో కలిశారు? ఏం చర్చలు జరిపారు? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల జగన్ పులివెందుల వెళ్లారు. అక్కడ పార్టీ శ్రేణులతో వరుసగా సమావేశాలు నిర్వహించారు. అయితే చేసిన పనులకు బిల్లులు అడుగుతుండడంతో ఆయన బెంగుళూరు వెళ్లిపోయినట్లు వార్తలు వచ్చాయి. కానీ వేరే మ్యాటర్ ఉన్నట్లు తెలుస్తోంది. కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ తో చర్చించేందుకే జగన్ బెంగళూరు వెళ్ళినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ రాజకీయమను కూడా అంత ఈజీ కాదు. ఒకవైపు తనపై ఉన్న అక్రమాస్తుల కేసులు, ఇంకోవైపు గత ఐదేళ్లుగా తన పాలన వైఫల్యాలు, అడ్డగోలు నిర్ణయాలపై చంద్రబాబు సర్కార్ గట్టిగానే ఉక్కు పాదం మోపుతుంది. జగన్ కూడా ఇది గ్రహించారు. తనను తప్పకుండా ఇబ్బంది పెడతారని కూడా చెప్పుకొచ్చారు. అందుకే ఇప్పుడు జాతీయ పార్టీల అవసరం జగన్ కు ఉంది. అందుకే కేంద్ర పెద్దలతో సఖ్యతగా వ్యవహరించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. బిజెపి అడిగిందే తడవుగా స్పీకర్ అభ్యర్థి ఓం బిర్లాకు మద్దతు తెలిపారు జగన్. అయితే కేంద్రంలో ఇప్పుడు టిడిపి కీలకంగా మారడంతో చంద్రబాబు వేసి అడుగులు బట్టి.. వ్యూహం మార్చాలని జగన్ భావిస్తున్నారు.
ఏపీలో కాంగ్రెస్ పార్టీ విస్తరిస్తే ప్రధానంగా నష్టం జరిగేది వైసీపీకే. వైసీపీ సీనియర్లంతా కాంగ్రెస్ పార్టీ బాట పట్టడం ఖాయం. అందుకే ముందు జాగ్రత్తగా డీకే శివకుమార్ తో జగన్ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. మరి అవసరమైతే వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని.. తనకు ఇబ్బందులు రాకుండా చూసే బాధ్యత తీసుకోవాలని కోరినట్లు ప్రచారం జరుగుతోంది. బిజెపి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇదే అనుమానం వ్యక్తం చేశారు. తప్పకుండా వైసీపీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతుందని జోష్యం చెప్పారు. కొద్దిరోజుల కిందటే వైసీపీ లాంటి పార్టీలను పిల్లకాలువలతో పోల్చారు షర్మిల. ఎప్పటికైనా సముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీలో పిల్ల కాలువలు చేరడం ఖాయమని వ్యాఖ్యానించారు. అటు జగన్ పులివెందుల నుంచి హఠాత్తుగా బెంగళూరు వెళ్లడంతోనే ఈ ప్రచారం ప్రారంభమైంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీని కాపాడుకోవడం జగన్ ముందున్న కర్తవ్యం. అయితే పాత కేసులు తెరపైకి వస్తే పరిస్థితి ఏంటన్నది జగన్ కు తెలియడం లేదు. పార్టీని నడిపించే వారు కూడా లేదు. ఇటువంటి తరుణంలో పార్టీని విలీనం చేయడం మేలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరి వాస్తవాలు ఏంటో తెలియాలి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More