Mahasena Rajesh: మహాసేన రాజేష్ మరోసారి యూటర్న్ తీసుకున్నాడు. పవన్ కళ్యాణ్ పై యుద్ధం ప్రకటించాడు. అతనికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయడానికి మహాసేన రాజేష్ సిద్ధపడ్డాడు. తాజాగా సంచలన ప్రకటన చేశాడు. మహాసేన పేరుతో మీడియా సంస్థను ఏర్పాటు చేసిన రాజేష్.. దళితుల కోసం బలమైన వాయిస్ వినిపించాడు. మంచి పేరు సంపాదించాడు. 2019 ఎన్నికల్లో జగన్ కు మద్దతుగా నిలిచాడు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. అదే పార్టీకి వ్యతిరేకంగా మారిపోయాడు మహాసేన రాజేష్.
గత ఐదు సంవత్సరాలుగా వైసీపీకి వ్యతిరేకంగా గట్టి పోరాటమే చేశాడు. మంచి ఫాలోయింగ్ సంపాదించాడు. పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలుస్తూ జనసేనలో చేరనున్నట్లు కూడా సంకేతాలు ఇచ్చాడు. అయితే అనూహ్యంగా తెలుగుదేశం పార్టీలో చేరాడు. ఆ పార్టీ తరపున పి. గన్నవరం ఎమ్మెల్యే టికెట్ సొంతం చేసుకున్నాడు. కానీ ఆయన పాత వీడియోలు వైరల్ గా మారడంతో.. ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. కొద్దిరోజులకే టికెట్ కోల్పోవాల్సి వచ్చింది. ఆ నియోజకవర్గ పొత్తులో భాగంగా జనసేనకు వెళ్ళింది.
టికెట్ వచ్చినట్టే వచ్చి చేజారిపోవడంతో మహాసేన రాజేష్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సొంతంగా అభ్యర్థులను నిలబెడుతున్నట్లు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. కానీ కొద్ది రోజులకే యూటర్న్ తీసుకున్నాడు. టిడిపి కూటమికి మద్దతు ప్రకటించాడు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి మహాసేన రాజేష్ కీలక ప్రకటన చేశారు. కూటమిలో ప్రకంపనలు రేపారు.
ఇన్నాళ్లు ఏ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అభిమానం చూపారో.. అదే పవన్ పై యుద్ధం ప్రకటించాడు మహాసేన రాజేష్. పవన్ తనను నమ్ముకున్న జనం కోసం నిలబడడని.. ఈ విషయంలో జగన్ బెటర్ అని ప్రకటించాడు. ఈ విషయాన్ని ప్రజలకు వివరిస్తానని కూడా ప్రత్యేక స్టేట్మెంట్ ఇచ్చాడు. అంతటితో ఆగకుండా పిఠాపురంలో పవన్ 200% ఓడిపోతాడని కూడా జోష్యం చెప్పారు. అయితే రోజుకో ప్రకటన.. పూటకో యూటర్న్ తో మహాసేన రాజేష్ క్రెడిబుల్టి కోల్పోతున్నారని.. ఏదైనా ఒక నిర్ణయానికి కట్టుబడాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే మహాసేన రాజేష్ ప్రకటన ఎంతవరకు వెళ్తుందో చూడాలి.అయితే మహాసేన రాజేష్ వెనుక వైసీపీ ఉందని.. వారి ప్రోద్బలంతో కీలకమైన ఎన్నికల వేళ ఇలా రాజేస్తున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. అమ్ముడుపోయి పవన్ పై బురద జల్లుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి