Kodali Nani: వైసీపీ ఫైర్ బ్రాండ్లలో కొడాలి నాని ఒకరు. అధినేత జగన్ పై ఈగ వాలనివ్వరు. చంద్రబాబుతో పాటు లోకేష్ లపై విరుచుకుపడతారు. వారిని తిట్టిన తిట్టు తిట్టకుండా తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయ్యారు. విమర్శల కంటే బూతులు తిడతారన్న పేరు దక్కించుకున్నారు. అందుకే చంద్రబాబుతో పాటు టిడిపి శ్రేణులు కొడాలి నానిని టార్గెట్ చేశాయి. ఈసారి ఎన్నికల్లో చావు దెబ్బ తీయాలని భావిస్తున్నాయి. ఇందులో కొంతవరకు సక్సెస్ అయ్యాయి. అయితే ఈ ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు కొడాలి నాని చివరకు జూనియర్ ఎన్టీఆర్ ను ఆశ్రయించాల్సి వచ్చింది.జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఎలాంటి సందేశం ఇస్తారో చూడాలి.
కొడాలి నాని నందమూరి హరికృష్ణకు ప్రధాన అనుచరుడుగా ఉండేవారు. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ కు దగ్గరయ్యారు. అత్యంత సన్నిహితంగా మారిపోయారు. 2004లో మాజీ మంత్రి రావి వెంకటేశ్వరరావును కాదని.. గుడివాడ టిక్కెట్ కొడాలి నాని కి ఇప్పించడంలో జూనియర్ ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించారు. అక్కడ నుంచి నాలుగు సార్లు గుడివాడ నుంచి నాని ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వచ్చారు. 2009లోటిడిపి ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నాని.. వైసీపీ ఆవిర్భావంతో ఆ పార్టీ వెంట నడిచారు. 2014,2019 ఎన్నికల్లో కూడా విజయం సాధించారు. అయితే గత ఐదు సంవత్సరాలుగా జరిగిన పరిణామాలతో చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేశారు. కొడాలి నానిని ఎలాగైనా ఓడించాలని ఎన్నారై వెనిగండ్ల రామును టిడిపి అభ్యర్థిగా బరిలో దించారు. దీంతో కొడాలి నాని కి టైట్ ఫైట్ తప్పడం లేదు.
మొన్నటికి మొన్న నామినేషన్ల ర్యాలీకి గుడివాడ ప్రజలు ముఖం చాటేశారు. ముఖ్యంగా జనసేన ప్రభావం అధికంగా ఉంది. పవన్ తో పాటు చిరంజీవి పై సైతం కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ మధ్యన చిరంజీవిని ఉద్దేశించి పకోడీగాళ్లు అంటూ కామెంట్స్ చేశారు. ఇది కాపులపై ప్రభావం చూపుతోంది. గుడివాడ నియోజకవర్గంలో 35 వేలకు పైగా కాపు సామాజిక వర్గ ఓటర్లు ఉన్నారు. వీరంతా యూటర్న్ తీసుకున్నారు. కూటమి వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కమ్మ సామాజిక వర్గం ఇప్పటికే కొడాలి నాని కి వ్యతిరేకంగా మారింది. చంద్రబాబుతో పాటు లోకేష్ లపై వ్యతిరేక వ్యాఖ్యలు చేయడంతో వారంతా కసిగా ఉన్నారు. దీంతో పరిస్థితి చూసిన కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
తాజాగా గుడివాడ నియోజకవర్గం పరిధిలోని గుడ్లవల్లేరు మండలం వేమవరంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీని చిత్తుచిత్తుగా ఓడిస్తేనే నాయకత్వ బాధ్యతలు జూనియర్ ఎన్టీఆర్ కు వస్తాయని.. పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ కు అడుగడుగునా అవమానాలు జరిగాయని గుర్తు చేశారు. చంద్రబాబుతో పాటు లోకేష్లను ఓడిస్తే టిడిపి నేతలు అంతా జూనియర్ ఎన్టీఆర్ దగ్గరకు వస్తారని.. పార్టీ ఆయన చేతుల్లోకి వస్తుందని చెప్పుకొచ్చారు. మొత్తానికైతే ఎంతటి ప్రత్యర్థినైనా గుడివాడ వచ్చి తనపై పోటీ చేయాలని సవాల్ విసిరిన కొడాలి నాని.. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రాపకం కోసం ప్రయత్నాలు చేస్తుండడం విశేషం.