KE Prabhakar: కర్నూలు జిల్లా అనగానే ముందుగా గుర్తుకొచ్చేది కొన్ని కుటుంబాలు. ముఖ్యంగా కోట్ల, కేఈ కుటుంబాలు దశాబ్దాలుగా రాజకీయాలు చేస్తూ వచ్చాయి. రెండు కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా రాజకీయాలు నడిచేవి. బద్ద వైరం ఉండేది. కోట్ల కుటుంబం నుంచి విజయభాస్కర్ రెడ్డి, కేఈ కుటుంబం నుంచి కృష్ణమూర్తి రాజకీయాలు నడిపేవారు. తెలుగుదేశం పార్టీతో కేఈ ప్రస్థానం ప్రారంభమైంది. అప్పటివరకు కోట్ల విజయ భాస్కర్ రెడ్డి కర్నూలు రాజకీయాలను శాసించగా.. టిడిపి ఆవిర్భావంతో.. ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి కేఈ కృష్ణమూర్తి కుటుంబం కర్నూలు రాజకీయాలను ప్రభావితం చేసేది. కానీ ఇప్పుడు కేఈ కుటుంబంలో కోట్ల కుటుంబం చిచ్చు పెట్టింది. కృష్ణమూర్తి సోదరుడు ప్రభాకర్ ఆశించిన సీటు కోట్ల కుటుంబం తన్నుకు పోవడంతో.. ప్రభాకర్ వైసీపీలోకి వెళ్లేందుకు డిసైడ్ అయ్యారు.
రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దారుణంగా దెబ్బతింది. దీంతో కోట్ల కుటుంబం గత ఎన్నికలకు ముందు టిడిపిలోకి వచ్చింది. దీంతో దశాబ్దాల వైరాన్ని మరిచి కోట్ల, కేఈ కుటుంబాలు ఏకతాటిపైకి వచ్చాయి. అయితే గత ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలో రెండు కుటుంబాలు కొట్టుకుపోయాయి. పత్తికొండ, డోన్ లో జై కుటుంబం, కర్నూలు ఎంపీ తో పాటు ఆలూరులో కోట్ల కుటుంబం ఓడిపోయింది.దీంతో రెండు కుటుంబాల మధ్య సఖ్యత చెదిరింది. గత ఐదేళ్లుగా ఆ కుటుంబాలు కలవడం అంతంత మాత్రమే. అయితే ఈ ఎన్నికల్లో రాజకీయ సమీకరణలు మారాయి. పొత్తులో భాగంగా మిగతా రెండు పార్టీలకు సీట్లు సర్దుబాటు చేయాల్సి రావడంతో.. కుటుంబాల టిక్కెట్ల విషయంలో చంద్రబాబు కత్తెర వేశారు. అందులో భాగంగా కేఈ కుటుంబానికి ఒకటే టికెట్ ఇచ్చారు. డోన్ నియోజకవర్గాన్ని కోట్ల కుటుంబానికి కేటాయించారు. ఈ పరిణామంతో కేఈ కృష్ణమూర్తి సోదరుడు ప్రభాకర్ టిడిపిని వీడేందుకు డిసైడ్ అయ్యారు.
తెలుగుదేశం పార్టీలో కేఈ ప్రభాకర్ బలంగా పనిచేశారు. కృష్ణమూర్తి నాయకత్వాన్ని బలపరచడంలో ప్రభాకర్ ముందుండేవారు. డోన్ నియోజకవర్గంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ధీటుగా పార్టీని సమన్వయపరచడంలో ప్రభాకర్ సక్సెస్ అయ్యారు. కానీ ప్రభాకర్ పేరును కనీస పరిగణలోకి తీసుకోకపోవడంతో ఆయన మనస్థాపానికి గురయ్యారు. అయితే ఇదే సమయంలో వైసీపీ నుంచి ప్రభాకర్ కు ఓపెన్ ఆఫర్ లభించినట్లు సమాచారం. వైసీపీలోకి వస్తే కర్నూలు ఎంపీ సీటు కేటాయిస్తామని జగన్ కబురు పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కర్నూలు ఎంపీ అభ్యర్థిగా వైసిపి బివై రామయ్య ను ప్రకటించింది. తొలుత గుమ్మనూరు జయరాంను అభ్యర్థిగా ప్రకటించగా.. ఆయన తిరస్కరించారు. ఆలూరు అసెంబ్లీ సీటును కేటాయించాలని కోరారు. జగన్ ఒప్పుకోకపోయేసరికి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిపోయారు. దీంతో కర్నూలు మేయర్ గా ఉన్న బివై రామయ్యను అభ్యర్థిగా ప్రకటించాల్సి వచ్చింది. ఇప్పుడు టిడిపి పై అసంతృప్తితో ఉన్న కేఈ ప్రభాకర్ వైసీపీకి ఆశాదీపంగా కనిపించారు. టిడిపిలో టిక్కెట్ దక్కకపోవడంతో.. ఎంపీ సీటు ఆఫర్ రావడంతో ప్రభాకర్ వైసీపీలో చేరడం ఖాయంగా తేలుతోంది. మొత్తానికి అయితే టిడిపిలో సుదీర్ఘకాలం పనిచేసిన కేఈ కుటుంబం.. వైసీపీ వైపు టర్న్ కావడం సంచలనమే.