Rajahmundry Priyanka Accident: మొన్న మధ్యన రాజమండ్రి లో మెడికో విద్యార్థి ప్రియాంక ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదం నింపింది. సినిమా చూసి స్నేహితులు బయటకు వచ్చే క్రమంలో ప్రసాద్ ఆదిత్య మాల్ గేటు ఎదుట మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు కారుతో పలుమార్లు ప్రియాంక ప్రయాణిస్తున్న బైకును గుద్దారు. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన ప్రియాంక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఏపీ ప్రభుత్వం తక్షణమే స్పందించింది. బాధిత కుటుంబానికి 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించడమే కాదు.. కేసు దర్యాప్తునకు ఆదేశించింది. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అయితే వీరు తాగిన మత్తులో అలా చేశారా? ఉద్దేశపూర్వకంగా చేశారా? దీని వెనుక అసలు కారణం ఏంటి అన్న లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
* జగన్మోహన్ రెడ్డిని కలిసిన తల్లిదండ్రులు..
రాష్ట్ర ప్రభుత్వం విచారణ కొనసాగిస్తుండగా ప్రియాంక తల్లిదండ్రులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ప్రియాంక కుటుంబానికి అండగా ఉంటానని.. ఆమెకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడే ఒక పాయింట్. ప్రియాంక ప్రమాదానికి సంబంధించి హిట్ అండ్ రన్ గా కేసు నమోదు చేశారు. ఆ తర్వాత బలమైన కోణాన్ని వెతికే పనిలో ఉన్నారు పోలీసులు. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రియాంక విషయంలో స్పందించింది తప్పు కాదు. ఒక ప్రతిపక్ష నేతగా, బాధ్యతాయుతమైన వ్యక్తిగా అలా స్పందించడం చాలా మంచిది కూడా.
* మనిషిని బట్టి అభిప్రాయం మారుతుందా..
ప్రియాంక మృతి విషయంలో స్పందించిన జగన్మోహన్ రెడ్డి.. అదే గొర్రెల కాపరి దానయ్య కుటుంబానికి ఎందుకు అండగా నిలబడలేదు. ప్రియాంకకు జరిగినది అన్యాయం అయితే దానయ్య కుటుంబానికి జరిగింది న్యాయమా? సమయాన్ని, సందర్భాన్ని, మనిషి బట్టి జగన్ దృష్టిలో న్యాయం రూపం మార్చుకుంటుందా? అక్కడ సిగిరి కుటుంబం కోసం నిలబడిన జగన్ ఇదే హిట్ అండ్ రన్ కేసును చిన్నపిల్లోడు తెలిసి తెలియక చేసాడు అంటూ సమర్ధించుకున్నారు. ఇప్పుడు మాత్రం ప్రియాంక విషయంలో న్యాయం జరగాలి, నిందితులకు శిక్ష పడాలి అంటూ వాదిస్తున్న జగన్ దానయ్య కుటుంబం గురించి ఒక్క క్షణమైనా ఆలోచించారా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ ఎదురవుతున్నాయి. చట్టం దృష్టిలో ఎంతటి పెద్దవారైనా శిక్ష పడాల్సిందే. కానీ జగన్మోహన్ రెడ్డి అభిప్రాయం అలా ఉన్నట్టు లేదు.