YS Jagan: ఒక మంచి వార్త వినేలోపు.. మరో చెడ్డ వార్త వచ్చి చెరిపేస్తోంది. జగన్ విషయంలో ఆ పార్టీ శ్రేణుల బాధ అదే. జగన్ పాదయాత్ర ప్రకటన చేసినప్పుడు వైసీపీ శ్రేణులకు వినసొంపుగా ఉంటుంది. వెయ్యి ఏనుగుల బలాన్ని అందిస్తుంది. మరో ఏడాది తర్వాత పాదయాత్ర మొదలు పెడతా.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తెస్తా అంటూ చేసే ప్రకటనలు ఆ పార్టీ నేతలతో పాటు మద్దతుదారుల్లో మంచి జోష్ నింపుతాయి. పాదయాత్ర ప్రకటనలతో వచ్చే బలం ఆ పార్టీ శ్రేణులకు.. జగన్ తన ప్రెస్ మీట్లతో ఆవిరి చేస్తున్నారా? అనే అనుమానం కలగక మానదు. జగన్ ప్రెస్ మీట్ పెడితే చాలు సోషల్ మీడియాలో ఏదో ఒక అంశంపై టోల్ కావడం సర్వసాధారణంగా మారిపోయింది.
* మీడియా ముందు నోరు జారుతున్న వైనం..
మీడియా ముందు మాట్లాడాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ జగన్ చేసే ప్రకటనలు, ప్రత్యర్థులపై చేసే విమర్శలు, తన పార్టీ నేతలకు మద్దతు పలికే సందర్భాలు.. ఇలా అంశం ఏదైనా కానీ జగన్ సోషల్ మీడియాలో వైరల్ కావాల్సిందే. మొన్న మావిగన్ కానీ.. నిన్న శ్రీధర్ అప్పలరాజు తనయుడు హిట్ అండ్ రన్ కేస్ కానీ.. డీఎస్సీ పరీక్ష వివాదం కానీ.. జగన్ చేసే వ్యాఖ్యలు అందుకు ఆయన చూపే హావభావాలు.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సైతం మనస్ఫూర్తిగా సమర్థించలేకపోతున్నారు. ఏదో ఒక అసహనం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉంటుంది.
* డీఎస్సీ, ఏపీపీఎస్సీ ఒకటేనట..
నిన్ననే డీఎస్సీ అక్రమాలు అంటూ మీడియా ముందుకు వచ్చారు జగన్. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో జరిగిన డీఎస్సీ, కూటమి ప్రభుత్వ హయాంలో జరిగిన డీఎస్సీ అంటూ మొదలుపెట్టి.. చివరికి డీఎస్సీని.. ఏపీపీఎస్సీని ఒక్కటి చేశారు. ఆ మరుక్షణం ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఒక పార్టీ అధినేత, ఆపై ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తికి డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి వ్యత్యాసం తెలియదా అంటూ నారా లోకేష్ నుంచి సోషల్ మీడియా యూజర్ల వరకు జగన్ పై విమర్శలు చేయడం ప్రారంభించారు. అయితే ఇదే మొదటిసారి తడబాటు అయితే గ్రహించాలి. ఆయన మీడియా ముందుకు వస్తే ఇలాంటి ఆణిముత్యాలు ఎన్నో. అయితే ఇలాంటి ఆణిముత్యాలు ప్రత్యర్థుల నోటి నుంచి ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూసే పరిస్థితి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీది. అంతెందుకు నారా లోకేష్ ను వెంటాడి వేటాడినంత పని చేశారు. కానీ ఇప్పుడు జగన్ నోటి నుంచి వస్తున్న ఆణిముత్యాలను వెతికి పట్టుకోవడానికి సోషల్ మీడియా ఉంది. అన్నింటికీ మించి బాధిత ప్రత్యర్థి వర్గాలు ఉన్నాయి. సొంత పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చే క్రమంలో.. ప్రెస్మీట్లతో వారి ఆశలపై నీళ్లు చల్లేస్తున్నారు.