YCP Party
YCP: వైసీపీ( YSR Congress) సమూల ప్రక్షాళనకు జగన్ నిర్ణయించారు. ప్రజల్లోకి వచ్చేందుకు నిర్ణయించిన ఆయన అంతకంటే ముందే నియామకాలు పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఉత్తరాంధ్ర నుంచి తన పర్యటన ఉండనున్న నేపథ్యంలో కీలక నియోజకవర్గాలకు సమన్వయకర్తలుగా కొత్త వ్యక్తులకు అవకాశం ఇచ్చారు. అయితే ఉత్తరాంధ్రలో సీనియర్ నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ కుటుంబానికి విశాఖ జిల్లాలో చాన్స్ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఎన్నికల్లో విశాఖ లోక్సభ స్థానం నుంచి బొత్స సత్యనారాయణ సతీమణి ఝాన్సీ లక్ష్మి బరిలోకి దించారు. ఆమె ఓడిపోయారు. అయితే స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ కు అవకాశం కల్పించారు జగన్. దీంతో విశాఖ వైసిపి నేతలు నిరాశకు గురయ్యారు. అయితే ఇప్పుడు భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స సత్యనారాయణ మేనల్లుడు చిన్న శ్రీనును నియమించారు. దీంతో వైసీపీ నేతలు మరింత ఆవేదనకు గురవుతున్నారు.
* అవంతి రాజీనామాతో
ఇటీవల వైసిపి ఇన్చార్జిగా ఉన్న మాజీమంత్రి అవంతి శ్రీనివాసరావు ( Avanti Shrinivas )పార్టీకి గుడ్ బై చెప్పారు. దీంతో భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త పదవి ఖాళీగా ఉంది. 2019 ఎన్నికల్లో భీమిలి నుంచి గెలిచిన అవంతి శ్రీనివాసరావును జగన్ తన కేబినెట్లోకి తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో సైతం అవకాశం ఇచ్చారు. కానీ ఆయన ఓడిపోయారు. ఫలితాల అనంతరం పార్టీలో యాక్టివ్ గా లేకుండా పోయారు. ఇటీవల పార్టీకి రాజీనామా చేశారు. దీంతో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అలెర్ట్ అయ్యారు. పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహిస్తూ వచ్చారు. భీమిలి నియోజకవర్గ ఇన్చార్జ్ పదవి ఆశించారు. కానీ అనూహ్యంగా చిన్న శ్రీనుకు ఇక్కడ అవకాశం ఇచ్చారు. గుడివాడ అమర్నాథ్కు చోడవరం బాధ్యతలు అప్పగించారు. ఇప్పటివరకు చోడవరం ఇన్చార్జిగా ఉన్న కరణం ధర్మశ్రీని అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్తగా నియమించారు.
* కాపు సామాజిక వర్గం అధికం
భీమిలి నియోజకవర్గం కాపు సామాజిక వర్గం అధికం. గుడివాడ అమర్నాథ్ కు( Gudivada Amarnath) శాశ్వత నియోజకవర్గం అంటూ లేకుండా పోయింది. ఈ ఎన్నికల్లో ఆయన గాజువాక నుంచి పోటీ చేశారు. దారుణ పరాజయం పాలయ్యారు. 2019 ఎన్నికల్లో అనకాపల్లి అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు అమర్నాథ్. జగన్ క్యాబినెట్లో మంత్రిగా కూడా ఉన్నారు. అనకాపల్లి నుంచి మరోసారి పోటీకి ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ జగన్ మాత్రం ఆయనను తప్పించారు. చివరి నిమిషంలో గాజువాక పంపించారు. అక్కడ ఆయనకు ఓటమి ఎదురైంది. అవంతి శ్రీనివాసరావు పార్టీకి గుడ్ బై చెప్పడంతో ఆ ప్లేస్ లోకి వెళ్లాలని భావించారు అమర్నాథ్. కానీ జగన్ షాక్ ఇచ్చారు. భీమిలి బాధ్యతలను బొత్స కుటుంబానికి అప్పగించారు.
* కీలక నియామకాలు
ఉత్తరాంధ్రలో( costal Andhra ) చాలా నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించారు. గాజువాక సమన్వయకర్తగా తిప్పల నాగిరెడ్డి కుమారుడు దేవాన్ రెడ్డిని, మాడుగుల నియోజకవర్గ సమన్వయకర్తగా మాజీమంత్రి బూడి ముత్యాల నాయుడును, ఈ గన్నవరం కోఆర్డినేటర్ గా గన్నవరపు శ్రీనివాసరావును నియమించారు. రాష్ట్ర అధికార ప్రతినిధిగా వరికుటి అశోక్ బాబు నియమితులయ్యారు. అయితే కరణం ధర్మశ్రీ చాలా రోజులుగా చోడవరం ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. ఆయనను తొలగించి గుడివాడ అమర్నాథ్కు ఆ బాధ్యతలు అప్పగించారు. అయితే ఈ నిర్ణయం ధర్మశ్రీ తో పాటు అమర్నాథ్ కు మింగుడు పడటం లేదు. మరోవైపు అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ బాధ్యతలు తీసుకునేందుకు కరణం ధర్మశ్రీ సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. మొత్తానికైతే విశాఖలో బొత్స కుటుంబ హవా నడుస్తోందని వైసీపీలో ఒక రకమైన అసంతృప్తి కనిపిస్తోంది. ముఖ్యంగా విశాఖ వైసిపి నేతలు దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ అధినేత జగన్ పట్టించుకునే స్థితిలో లేరని తెలుస్తోంది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Jagan decided to purge ycp completely
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com