Jagan Daughters: ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతుంది. 2029 ఎన్నికలకు మరో మూడు సంవత్సరాల వ్యవధి ఉంది. ఎలాగైనా పట్టుకొనసాగించాలని కూటమి.. పూర్వ వైభవం సాధించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేయని ప్రయత్నం అంటూ లేదు. అయితే గత మాదిరిగా చూస్తే జగన్మోహన్ రెడ్డికి ఫ్యామిలీ బలం తగ్గింది. చంద్రబాబుకు మాత్రం ఫ్యామిలీ అండగా నిలుస్తోంది. నందమూరి తో పాటు నారా కుటుంబం అండగా నిలబడుతోంది. ఇంకోవైపు దగ్గుబాటి ఫ్యామిలీ సైతం విభేదాలను పక్కనపెట్టి చంద్రబాబుతో నడుస్తోంది. అయితే వచ్చే ఎన్నికలను టార్గెట్ చేసుకున్న జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు దిశగా అడుగులు వేస్తున్నారు. దూరమైన వర్గాలను దగ్గర చేసుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలో ఆయన తన కుమార్తెలను రాజకీయాల్లోకి తేవాలన్న నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం సాగుతోంది. ఉన్నత విద్యతోపాటు ఉద్యోగాల్లో స్థిరపడిన పిల్లలు ఇద్దరూ ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో తన తండ్రి జగన్ కు అండగా నిలవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
* అప్పట్లో అండగా ఫ్యామిలీ..
కాంగ్రెస్ పార్టీని విభేదించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు జగన్ మోహన్ రెడ్డి. ఆ సమయంలో ఆయన ఫ్యామిలీ అండగా నిలిచింది. తల్లి విజయలక్ష్మి ఒకవైపు.. చెల్లెలు షర్మిల ఒకవైపు అండగా నిలిచి పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు దోహదపడ్డారు. మొత్తం రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీ అంతా రంగంలోకి దిగింది. కానీ వైయస్ వివేకానంద రెడ్డి హత్య తర్వాత జరిగిన పరిణామాలు.. వైయస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాధాన్యతా అంశాల్లో ఆ ఫ్యామిలీలో చీలిక కనిపించింది. మరోవైపు వ్యక్తిగత కుటుంబ వ్యవహారాలతో చెల్లెలు షర్మిల తో పాటు తల్లి విజయమ్మ దూరమయ్యారు. అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన పిల్లలను సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది.
* కడప నుంచి బరిలోకి..
మునుపటి మాదిరిలా జగన్మోహన్ రెడ్డి అన్ని పనులు చూసుకునేందుకు వీలుపడడం లేదు. అన్నింటికీ మించి సొంత జిల్లా కడపపై ఫోకస్ పెట్టలేకపోతున్నారు. కొంతమంది సీనియర్ నేతలు ఉన్నారు. ఆపై జగన్ సతీమణి భారతి ఉన్నారు కానీ.. అనుకున్న స్థాయిలో రాణించలేకపోతున్నారు. అందుకే జగన్ తన పెద్ద కుమార్తెను వచ్చే ఎన్నికల్లో రంగంలోకి దించుతారని ప్రచారం సాగుతోంది. వచ్చే ఏడాది పార్టీ ప్లీనరీ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. దానిని వేదికగా చేసుకుని కుమార్తె పొలిటికల్ ఎంట్రీ పై జగన్ ప్రకటన చేస్తారని తెలుస్తోంది. కడపలో ఆమెను బరిలో దించుతారని ప్రచారం సాగుతోంది. జగన్ కుమార్తె హర్ష రెడ్డి సైతం పొలిటికల్ ఎంట్రీ కి సంబంధించి అవసరమైన అన్ని అంశాలపై దృష్టి పెట్టినట్లు సమాచారం. నియోజకవర్గాల పునర్విభజన ఉంటున్న నేపథ్యంలో ఆమె కడప పార్లమెంట్ సీటు నుంచి కానీ.. కడప జిల్లాలో ఏదైనా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కానీ బరిలో దిగే ఛాన్స్ కనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.