Jagan: రాష్ట్రమంతా ఒక ఎత్తు.. పులివెందుల మరో ఎత్తు అన్నట్టు ఉంది పరిస్థితి. జగన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించే సమయంలో చంద్రబాబు, పవన్ లను టార్గెట్ చేస్తున్నారు. కడప, పులివెందులలో మాత్రం షర్మిల వ్యాఖ్యలపై కౌంటర్ అటాక్ చేస్తున్నారు. అయితే పులివెందులలో ఎప్పుడు సునాయాసంగా గెలిచే జగన్ లో ఒక రకమైన అనుమానం కనిపిస్తోంది. కళ్ళల్లో బెదురు వ్యక్తమవుతోంది. దానికి షర్మిలే కారణంగా తెలుస్తోంది.ఈరోజు పులివెందులలో నామినేషన్ వేసిన జగన్ మాటలు చూస్తుంటే.. షర్మిల ద్వారా ఆయనకు మూల్యం తప్పదని స్పష్టం అవుతోంది. కేవలం షర్మిలను ఉద్దేశించి జగన్ అనుచిత కామెంట్స్ చేశారు.
పులివెందులలో ఇప్పటికే జగన్ తరుపున ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఈరోజు జగన్ నామినేషన్ దాఖలు చేయడంతో పాటు సభలో పాల్గొనడం ద్వారా మలి విడత ప్రచారానికి శ్రీకారం చుట్టినట్లు అయింది. మరోవైపు జగన్ సతీమణి భారతి పులివెందులలో వారం రోజులు పాటు ఇంటింటా ప్రచారం చేయనున్నారు. కాగా పులివెందుల సభలో జగన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పులివెందుల కల్చర్, కడప కల్చర్, రాయలసీమ కల్చర్ అంటూ వేలెత్తి చూపించే కార్యక్రమం చేస్తున్నారని జగన్ గుర్తు చేశారు. అది నిజమేనని.. మంచి చేయడం మన కల్చర్.. మంచి మనసు మన కల్చర్.. మాట తప్పకపోవడం మన కల్చర్.. బెదిరింపులకు లొంగక పోవడం మన కల్చర్ అంటూ జగన్ చెప్పుకొచ్చారు. పులివెందులను ఈ రాష్ట్రం పువ్వుల్లో పెట్టుకున్న విషయాన్ని గుర్తు చేశారు. అందుకే ఒక వైయస్సార్, ఒక జగన్ ను ఈ రాష్ట్ర ప్రజానీకం అభిమానించిన విషయాన్ని ప్రస్తావించారు.
జగన్ తన సోదరి షర్మిలకు ఇచ్చి పడేశారు. ఆమె పేరు ప్రస్తావించకుండానే విమర్శనాస్త్రాలు సంధించారు. రాజశేఖర్ రెడ్డి మీద కుట్రలు, కుతంత్రాలు చేసిన.. ఆయన శత్రువులతో పసుపు చీర కట్టుకొని.. వారి ఇళ్లకు వెళ్లి.. వారికి మోకరిల్లి.. వారి కుట్రలో భాగమై.. వారి స్క్రిప్టులను చదివి వినిపిస్తున్న వీరా వైయస్సార్ అభిమానులు అంటూ షర్మిలపై తీవ్రస్థాయిలో జగన్ విరుచుకుపడ్డారు. పనిలో పనిగా బాబాయ్ వివేక హత్య కేసు గురించి కూడా ప్రస్తావించారు. వివేకాకు రెండో వివాహం, సంతానం ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు. ఎవరు ఫోన్ చేస్తే అవినాష్ వెళ్ళాడో గుర్తించాలన్నారు. వైయస్సార్ ఎవరి మీద పోరాటం చేశారో.. వారితోనే తన చెల్లెళ్లు చేతులు కలిపారని.. అవినాష్ రెడ్డి చిన్నపిల్లాడు అని జగన్ వెనుకేసుకు రావడం విశేషం.