Avinash Reddy
Avinash Reddy: అవసరం ఎంత పనైనా చేయిస్తుందంటారు. ఎందాకైనా తీసుకెళుతుంది అంటారు. అవసరాన్ని బట్టి రంగులు మార్చడం మనిషి నైజం. ఇప్పుడు అటువంటి పరిస్థితి జగన్ కు ఎదురైంది. రాష్ట్రంలో అంతులేని మెజారిటీతో సీఎంగా ఐదేళ్ల పాటు కాలం గడిపిన జగన్ కు ఇప్పుడు ఓటమితో ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. దారుణ పరాజయంతో అసెంబ్లీకి కూడా వెళ్లలేని స్థితిలోకి ఆయన చేరుకున్నారు. అందుకే ఎంపీగా పోటీ చేసి..జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు.అయితే అందుకు అవినాష్ ఒప్పుకుంటారా?లేదా? అన్న కొత్త చర్చ ప్రారంభం అయ్యింది.
పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి గెలిచారు జగన్. కానీ రాష్ట్రంలో దారుణ ఓటమి ఎదురయ్యేసరికి.. అసెంబ్లీలో అడుగు పెట్టకూడదని భావిస్తున్నారు.ఏ తరహా అవమానాలు ఎదురవుతాయో ఆయనకు తెలియంది కాదు. అందుకే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. కడప ఎంపీగా పోటీ చేస్తారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఈ విషయం ప్రకటిస్తారని కూడా టాక్ నడిచింది. కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది. వైసీపీ నుంచి కూడా ఈ విషయంలో క్లారిటీ లేదు. అయితే రాజీనామాలు, తిరిగి పోటీ చేయడంపై మాత్రం తర్జనభర్జన సాగుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజీనామా చేస్తే తిరిగి గెలవగలమా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
అయితే అన్నింటికీ మించి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంపీ పదవికి అవినాష్ రెడ్డి రాజీనామా చేయరని ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం అవినాష్ రెడ్డి పై ఉన్న వివేక హత్య కేసు నుంచి ఎంపీ పదవి ఒక రక్షణ కవచంలా ఆయన భావిస్తున్నారు. అదే సమయంలో జగన్ సైతం తన అక్రమాస్తుల కేసుల నుంచి బయట పడాలంటే కేంద్ర రాజకీయాలకు వెళ్లడమే మేలన్న నిర్ణయానికి వచ్చారు. అందుకే ఇప్పుడు ఎంపీగా అవినాష్ రాజీనామాంసం హాట్ టాపిక్ గా మారింది. ఒకవేళ అవినాష్ రాజీనామా చేసేందుకు ఒప్పుకోకపోతే.. ఆయనపై జగన్ ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. పులివెందుల నుంచి తాను రాజీనామా చేసి ఆ స్థానంలో తల్లి విజయమ్మను నిలబెడతారని.. కడప ఎంపీగా జగన్ పోటీ చేస్తారని.. ఇందుకు షర్మిల సైతం ఒప్పుకున్నారని ప్రచారం సాగుతోంది. అవినాష్ రెడ్డి ని పక్కకు తప్పించాలని షర్మిల తో పాటు సునీత ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. అందుకే మధ్య మార్గంగా అవినాష్ ను తప్పిస్తారని కూడా ఒక ప్రచారం ఉంది. అయితే ఇన్ని అనుమానాల మధ్య అవినాష్ రెడ్డి పదవి నుంచి తప్పుకోవడానికి ఒప్పుకుంటారా? ఒప్పుకోకపోతే పర్యవసానాలు ఏంటో? అవి ఎలా ఉంటాయో? అన్న చర్చ నడుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంపీ పదవి తనకు కీలకమని జగన్ భావిస్తున్నారు. అవినాష్ రెడ్డి సైతం అదే భావనతో ఉన్నారు. అందుకే ఇప్పుడు అవసరాలు అన్నవి ఇద్దరికీ ఉన్నాయి. దీనికోసం ఎంతదాకా అయినా తెగించేందుకు ఇద్దరూ సిద్ధంగా ఉన్నారు. అందుకే వైసీపీలో జరిగే పరిణామాలు మున్ముందు ఎలా ఉండబోతున్నాయో చూడాలి.