Homeఆంధ్రప్రదేశ్‌AP Survey: ఇండియా టుడే ఛానల్ సి ఓటర్ సర్వే.. ఏపీలో గెలుపు ఎవరిదంటే?

AP Survey: ఇండియా టుడే ఛానల్ సి ఓటర్ సర్వే.. ఏపీలో గెలుపు ఎవరిదంటే?

AP Survey: ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. పొత్తుల లెక్కలు కొలిక్కి వస్తున్నాయి. అధికార వైసిపి ఒంటరి పోరుకు సిద్ధమైంది. తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకుంది. అటు కాంగ్రెస్ పార్టీ సైతం షర్మిలకు పీసీసీ పగ్గాలు అప్పగించి వచ్చే ఎన్నికల్లో గణనీయమైన ఓట్లు పొందాలని వ్యూహరచన చేస్తోంది. మరోవైపు వామపక్షాలు సైతం కాంగ్రెస్ పార్టీతో జత కట్టేందుకు చూస్తున్నాయి. మరోవైపు టిడిపి, జనసేన కూటమిలోకి చేరేందుకు బిజెపి సానుకూలంగా ఉన్నట్లు సంకేతాలు వస్తున్నాయి. దీంతో ఏపీలో రాజకీయ స్వరూపం మారనుంది. గెలుపు పై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో అందరి ఫోకస్ మన రాష్ట్రం పైనే ఉంది. అటు నేషనల్ మీడియా సంస్థలు, సర్వే ఏజెన్సీలు రంగంలోకి దిగాయి. ప్రజాభిప్రాయాన్ని ఓడిసిపట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఈ సర్వే ప్రక్రియ కొనసాగుతోంది. ఫోన్లలో సైతం సర్వే సంస్థలు అభిప్రాయాలు సేకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జాతీయస్థాయిలో పేరు మోసిన ఇండియా టుడే ఛానల్ సి ఓటర్ సంస్థతో కలిసి.. మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో తాజాగా సర్వే చేసింది. ఇందులో ఏపీకి సంబంధించి వైసీపీ, టిడిపి- జనసేన కూటమి, కాంగ్రెస్, బిజెపి.. ఇలా నాలుగు పార్టీలను విభజించి సర్వే చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు వచ్చిన సర్వేలకు భిన్నంగా.. ఈ సర్వే ఫలితాలు రావడం విశేషం.

లోక్ సభ స్థానాల ప్రాతిపదికన ఈ సర్వే చేసినట్లు తెలుస్తోంది. 25 పార్లమెంట్ స్థానాలకు గాను.. టిడిపి- జనసేన కూటమి 17 స్థానాలతో ముందంజలో ఉంది. వైసిపి మాత్రం ఎనిమిది పార్లమెంట్ స్థానాలకు పరిమితం కానుంది. గత ఎన్నికల్లో వైసిపి 22 స్థానాలు దక్కించుకోగా.. ఈ ఎన్నికల్లో మాత్రం 14 ఎంపీ స్థానాలు చేజార్చుకొనుందని తేలడం విశేషం. టిడిపి- జనసేన కూటమికి 45 శాతం ఓట్లు దక్కే అవకాశం ఉందని తేలింది. వైసీపీ సైతం 41% ఓట్లు దక్కించుకుంటుందని ఈ సర్వే తేల్చింది. కాంగ్రెస్ పార్టీ 2.7% ఓట్లను, బిజెపి 2.1 శాతం ఓట్లను దక్కించుకుంటాయని స్పష్టం చేసింది. ప్రతి పార్లమెంట్ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. ఈ లెక్కన టిడిపి-జనసేన కూటమికి 119 స్థానాలు, వైసీపీకి 56 సీట్లు వచ్చే అవకాశం ఉంది.

ఇప్పటికే తెలుగుదేశం పార్టీతో పొత్తుకు బిజెపి సానుకూలంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. నేరుగా ఢిల్లీ వెళ్లి బిజెపి అగ్రనేతలతో చంద్రబాబు చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు పవన్ కళ్యాణ్ సైతం ఈరోజు ఢిల్లీ చేరుకున్నారు. ఈ రాత్రికి కీలక చర్చలు జరపనున్నారు. రేపు పొత్తుల అంశంపై ఒక క్లారిటీ రానుంది. అయితే తాజాగా చేపట్టిన సర్వే టిడిపి – జనసేన వరకే కూటమిగా పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆ రెండు పార్టీలకు బిజెపి తోడైతే మరికొన్ని సీట్లు పెరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే తాజా సర్వే టిడిపి, జనసేనలో జోష్ నింపుతోంది. వైసీపీలో మాత్రం ఒక రకమైన కలవరం కనిపిస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular