Vidadala Rajini: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ నేతలపై ఆరోపణలు ఆగడం లేదు. అధికారం కోల్పోయిన తర్వాత కూడా చాలామంది నేతల అవినీతి ఒక్కొక్కటి బయటకు వస్తోంది. ముఖ్యంగా మాజీ మంత్రి విడదల రజినిపై వస్తున్న ఆరోపణలు అన్నీ ఇన్ని కావు. ఇటీవల ఆమె ఉద్యోగాల కోసం డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. గతంలో సొంత పార్టీ నేతలు సైతం ఆమెపై ఫిర్యాదులు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవల వైసిపి లోకేష్ రెడ్బుక్ మాదిరిగా.. డిజిటల్ బుక్ తెచ్చింది. అందులో టిడిపి కూటమి నేతలపై ఫిర్యాదు చేస్తే.. వివరాలు నమోదు చేసుకోవాలని జగన్మోహన్ రెడ్డి సూచించారు. అయితే అనూహ్యంగా మాజీ మంత్రి రజినీ పై ఫిర్యాదులు రావడం విశేషం. అయితే రజిని సైతం వైసీపీలో యాక్టివ్గానే ఉన్నారు కానీ.. ఆమె సేవలను వేరే ప్రాంతంలో వినియోగించుకోవాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది.
* 2019 ఎన్నికలకు ముందు..
2019 ఎన్నికల కు ముందు తెలుగుదేశం( Telugu Desam) పార్టీ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ లో చేరారు రజిని. ఎక్కడో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉంటూ.. సాఫ్ట్వేర్ కంపెనీలు నడుపుతున్న రజిని పత్తిపాటి పుల్లారావు నేతృత్వంలో టిడిపిలో చేరారు. కానీ జగన్మోహన్ రెడ్డి పిలిచేసరికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి పోటీ చేసి అదే ప్రత్తిపాటి పుల్లారావు పై గెలిచారు. స్థానిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేసిన జగన్ వినలేదు. మంత్రి పదవి ఇచ్చి ప్రోత్సహించారు. కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతలను అప్పగించారు. అయితే 2024 ఎన్నికలకు ముందు తీవ్ర గందరగోళం నేపథ్యంలో టిక్కెట్లను మార్చారు. చిలకలూరిపేట నుంచి రజినిని గుంటూరు వెస్ట్ కు పంపించారు. అక్కడ దారుణ పరాజయం పాలయ్యారు రజని.
* ప్రస్తుతం క్రియాశీలకంగానే..
అయితే ప్రస్తుతం విడదల రజిని( vedala Rajini ) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చాలా యాక్టివ్ గా ఉన్నారు. అయితే ఆమెను ఈసారి కూడా వేరే నియోజకవర్గంలో వినియోగించుకోవాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ప్రస్తుతం రేపల్లె నియోజకవర్గం వర్గానికి మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత. అదే నియోజకవర్గానికి చెందిన మోపిదేవి వెంకటరమణ సైతం టిడిపిలో చేరారు. అక్కడ టిడిపి బలం కూడా పెరిగింది. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలహీనంగా కనిపిస్తోంది. అందుకే రేపల్లె నియోజకవర్గం బాధ్యతలను విడదల రజినీకి అప్పగిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అదే విషయాన్ని విడదల రజనీకి చెప్పినట్లు ప్రచారం సాగుతోంది. కానీ అప్పటినుంచి ఆమె అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
* అప్పట్లోనే ప్రచారం
వాస్తవానికి ఎన్నికల ఫలితాల( election result ) అనంతరం విడదల రజిని జనసేనలో చేరుతారని ప్రచారం సాగింది. అందుకు తగ్గ ప్రయత్నాలు జరిగినట్లు కూడా తెలుస్తోంది. ప్రధానంగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేనలో చేరినప్పుడే ఆ ప్రచారం జరిగింది. అయితే జనసేన నాయకత్వం అనుకున్న స్థాయిలో స్పందించలేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గానే ఉన్నారు. కానీ తరచు నియోజకవర్గాలు మార్చడంపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. కూటమి పార్టీలు ఆహ్వానిస్తే చేరిపోయేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.