YS Jagan Mohan Reddy : వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈరోజు శ్రీకాకుళం వెళ్తున్నారు. మాజీమంత్రి అప్పలరాజును కలుస్తున్నారు. తన కుమారుడు కారణంగా జరిగిన బైక్ ప్రమాదం కేసులో అప్పలరాజు తలదూర్చారని.. తప్పు దోవ పట్టించారని.. మరొకరిని బలిపశువు చేశారని.. బాధ్యతాయుతమైన వ్యక్తి అలా చేయడం ఏంటనే ప్రశ్న ఉత్పన్నమైంది. అందుకే పోలీసులు అప్పలరాజును అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనను పరామర్శించేందుకు జగన్ శ్రీకాకుళం వెళ్తున్నారు. కానీ అప్పలరాజు కుమారుడు కారణంగా చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించకపోవడం మాత్రం విమర్శలకు తావిస్తోంది. ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నిస్తున్న వారు అధికం.
* సొంత పార్టీలోనే చర్చ..
జగన్మోహన్ రెడ్డి ఇటువంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారో అర్థం కావడం లేదని సొంత పార్టీ వారే తప్పు పడుతున్నారు. ఈ ఘటన వెనుక రాజకీయ కోణం ఉండవచ్చు కానీ… నిందితుల స్థానంలో ఉన్న వారిని పరామర్శించి.. బాధిత కుటుంబాన్ని పరామర్శించకపోవడం ఏమిటి అనే ప్రశ్న వినిపిస్తోంది. సమాజానికి ఇది తప్పుడు సంకేతం అని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు నుంచి కూటమి నేతల వరకు దీనిపై తలో మాటా ఆడుతారు. కానీ తటస్థులతో పాటు విద్యాధికులు మాత్రం దీనిని ఎక్కువగా తప్పు పడుతున్నారు. ఇప్పటికే ఫోన్లో పరామర్శించి ఉంటారు. దాంతో సరిపెట్టి ఉంటే సరిపోయేది. కానీ ఇప్పుడు అనవసరంగా పరామర్శ పేరుతో బల ప్రదర్శనకు దిగడం మాత్రం విమర్శలకు తావిస్తోంది.
* తిరుగుబాటుకు ఛాన్స్..
తప్పకుండా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే దీనిపై తిరుగుబాటు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మద్యం కుంభకోణం కేసులో చాలామంది అరెస్టయ్యారు. ఎక్కువమంది జగన్మోహన్ రెడ్డికి ఆప్తులు. అంతకుమించి ఆత్మీయులు. ఒక పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప.. ఇలాంటి వారంతా జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆత్మీయులే . జగన్మోహన్ రెడ్డి కోసం ఎంతటి పనికి అయినా ముందుకు వచ్చే వారే. అటువంటివారు జైల్లో ఉంటే పరామర్శించిన జగన్.. ఒక కేసును తారుమారు చేసిన అప్పలరాజును ఎలా పరామర్శిస్తారు. మొన్న మధ్యన అంబటి రాంబాబుల వ్యవహరించలేనని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. అంటే అటువంటి నేతలు విషయంలో జగన్ అతి ప్రాధాన్యం ఇస్తున్నారని అర్థం అవుతోంది. కచ్చితంగా ఈ పరామర్శలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద ప్రకంపనలే రేపుతాయని తెలుస్తోంది.