YS Sharmila: దేశవ్యాప్తంగా రాజ్యసభ ఎన్నికల సందడి కనిపిస్తోంది. పది రాష్ట్రాల నుంచి 24 మంది ఎంపీలు పదవీ విరమణ చేస్తున్నారు. వారి స్థానంలో కొత్త వారి ఎంపికకు సంబంధించి ఎన్నికలు జరగనున్నాయి. ఏపీ నుంచి నలుగురు సభ్యులు పదవీ విరమణ చేయనుండగా.. ఆ పదవులన్నీ కూటమి ఖాతాలోనే పడనున్నాయి. మరోవైపు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలకు సైతం రాజ్యసభ పదవి ఖాయమని ప్రచారం నడుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని కాంగ్రెస్ వైపునకు తిప్పేందుకు షర్మిల కు ఛాన్స్ ఇస్తారని తెలుస్తోంది. ప్రధానంగా ఆమెను కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎంపిక చేస్తారని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. ప్రస్తుతానికి ఆమెకు సానుకూలమైన వాతావరణం ఉన్నట్లు తెలుస్తోంది.
* కర్ణాటక నుంచి ఛాన్స్..
కర్ణాటక నుంచి ముగ్గురు సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. ఆ మూడు పదవులు కాంగ్రెస్ పార్టీకి దక్కనున్నాయి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సైతం పదవీ విరమణ చేయనున్నారు. అయితే కర్ణాటకలో సీఎం మార్పు ఉంటుందన్న ప్రచారం నడుస్తోంది. అదే జరిగితే డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పదవి కోసం ఆశిస్తున్నారు. అయితే సిద్ధరామయ్య వర్గం దానిని అడ్డుకుంటోంది. మద్యేమార్గంగా మల్లికార్జున్ ఖర్గేకు ముఖ్యమంత్రి పదవి అప్పగించి.. రాజ్యసభకు సిద్ధరామయ్యకు పంపిస్తారని తెలుస్తోంది. మరో రెండు రాజ్యసభ పదవుల్లో ఒకటి షర్మిల కు ఖాయం చేసినట్లు పొలిటికల్ వర్గాల్లో నడుస్తోంది. అటు డీకే శివకుమార్ వర్గం సైతం షర్మిలకు మద్దతు తెలుపుతున్నట్లు తెలుస్తోంది.
* అప్పట్లోనే హామీ..
తన తండ్రి పేరుతో తెలంగాణలో పార్టీని ఏర్పాటు చేశారు షర్మిల. కానీ పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. విలీన సమయంలోనే షర్మిలకు గట్టి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ తరుపున రాజ్యసభ పదవి ఇస్తామని హామీ ఇచ్చారని సమాచారం. ఇప్పుడు దాని ప్రకారం కర్ణాటక నుంచి షర్మిలను ప్రమోట్ చేస్తారని తెలుస్తోంది. ఈ విషయంలో రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. షర్మిలకు రాజ్యసభ పదవి ఇవ్వడం ద్వారా తెలుగు రాష్ట్రాల్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులను మరింతగా ఆకర్షించవచ్చన్నది కాంగ్రెస్ ఆలోచన. వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో సైతం ఓట్ల పరంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలంటే.. షర్మిల నాయకత్వాన్ని మరింత పెంచాలని ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
