Homeఆంధ్రప్రదేశ్‌AP Elections 2024: టెక్కలి పై గురిపెట్టిన జగన్

AP Elections 2024: టెక్కలి పై గురిపెట్టిన జగన్

AP Elections 2024: రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాలు ప్రత్యేకం. అక్కడ బలమైన నేతలు ప్రాతినిధ్యం వహిస్తుండటమే కారణం. అటువంటి నియోజకవర్గాల్లో టెక్కలి ఒకటి. ఇక్కడ టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెనాయుడు అభ్యర్థి కావడంతో సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎలాగైనా అచ్చన్నను ఓడించాలని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారు. బలమైన కుటుంబ నేపథ్యం ఉండడం, వైసీపీకి కొరకరాని కొయ్యగా మారడం వంటి కారణాలతో.. ఎలాగైనా టెక్కలిలో వైసీపీ జెండా ఎగురువేయాలని జగన్ భావిస్తున్నారు. అందుకే దూకుడుగా వ్యవహరించే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసును బరిలో దించారు. కానీ క్షేత్రస్థాయిలో జగన్ తీసుకున్న నిర్ణయాలు ఇక్కడ ప్రతికూల ఫలితాలు చూపిస్తున్నాయి. అచ్చన్నను ఓడించడానికి పక్కన పెడితే.. దువ్వాడ శ్రీనివాస్ ఇంటి పోరును అధిగమించలేకపోతున్నారు.

టెక్కలిలో అచ్చన్నను ఓడించడం అంత ఈజీ కాదు. 2014,2019 ఎన్నికల్లో ఆయన గెలుపొందారు. హ్యాట్రిక్ పై దృష్టిపెట్టారు. ఈసారి ఎలాగైనా గెలుస్తానని ధీమాతో ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే పరిస్థితులు ఉన్నాయి. గత ఎన్నికల్లో అచ్చన్న పై వైసీపీ అభ్యర్థిగా పేరాడ తిలక్ పోటీ చేశారు. జగన్ ప్రభంజనంలో సైతం ఓడిపోయారు. అటు ఎంపీ అభ్యర్థిగా వైసీపీ నుంచి పోటీ చేసిన దువ్వాడ శ్రీనివాస్ ఓడిపోయారు. అప్పటివరకు టెక్కలి ఇన్చార్జిగా ఉన్న పేరాడ తిలక్ ను ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా మార్చారు. గత ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన దువ్వాడ శ్రీనివాసుని తెచ్చి అచ్చన్న పై పోటీకి నిలిపారు. అయితే తనకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి కాంగ్రెస్ లో చేరిపోయారు. టెక్కలి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. అటు అచ్చన్న సైతం బలంగా ఉన్నారు. కృపారాణి ఓట్లు చీల్చితే అచ్చన్నకు భారీ మెజారిటీ దక్కే అవకాశం ఉందని టిడిపి వర్గాలు భావిస్తున్నాయి.

ఎట్టి పరిస్థితుల్లో అచ్చన్న గెలవకూడదని జగన్ భావిస్తున్నారు. అందుకే టెక్కలిలో స్వయంగా వచ్చి ప్రచారం చేయాలని చూస్తున్నారు. ప్రస్తుతం ఆయన రాష్ట్రవ్యాప్తంగా మేమంతా సిద్ధం పేరిట బస్సు యాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం గోదావరి జిల్లాల్లో జరుగుతున్న ఈ యాత్ర విశాఖ జిల్లాలో అడుగుపెట్టనుంది. తరువాత విజయనగరం, శ్రీకాకుళంలో జరగనుంది. ఈనెల 24 తో ఈ బస్సు యాత్ర ముగియనుంది. టెక్కలి లో ముగింపు సభ భారీగా నిర్వహించాలని జగన్ భావిస్తున్నారు. పార్టీ శ్రేణులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. కేవలం అచ్చన్నను టార్గెట్ చేసుకుని టెక్కలిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. లక్షలాది మంది జనాలను సమీకరించి.. టెక్కలి లో వైసీపీ జెండా ఎగురవేయాలని జగన్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఇప్పటికే టెక్కలిలో అచ్చన్న పట్టు బిగించారు. పార్టీలో భారీగా చేరికలు పెరుగుతున్నాయి. నాలుగు మండలాల్లో ప్రతి పంచాయతీ నుంచి ఈ చేరికలు ఉన్నాయి. ఇటువంటి తరుణంలో జగన్ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular