Homeఆంధ్రప్రదేశ్‌AP Politics: మారుతున్న సామాజిక లెక్కలు.. ఎవరికి కలిసొచ్చేది?

AP Politics: మారుతున్న సామాజిక లెక్కలు.. ఎవరికి కలిసొచ్చేది?

AP Politics: ఏపీలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయి. సరికొత్త సామాజిక సమీకరణలు తెరపైకి వస్తున్నాయి. టిడిపికి మద్దతుగా నిలిచే కమ్మ సామాజిక వర్గం నేతలు వైసీపీలో చేరుతుండగా.. వైసీపీకి మద్దతుగా ఉండే రెడ్డి సామాజిక వర్గం నేతలు టిడిపి వైపు చూస్తున్నారు. దీంతో కొత్త లెక్కలు తెరపైకి వస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని కులాల కుంపట్లు రేగుతున్నాయి. ఇప్పటికే పవన్ వెంట మెజారిటీ కాపు సామాజిక వర్గం ఉండగా.. దానికి బ్రేక్ వేయాలని వైసీపీ భావిస్తోంది. ముద్రగడ పద్మనాభం లాంటి నేతలను తమ వైపు తిప్పుకోవాలని చూస్తోంది. కానీ ఏ అవకాశం వదలకూడదు అని భావిస్తున్న టిడిపి, జనసేన సైతం ముద్రగడను తమ కూటమిలోకి కలుపుకునేందుకు ప్రయత్నిస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కమ్మ సామాజిక వర్గం అండగా నిలుస్తోంది. కమ్మ సామాజిక వర్గం ఉన్న మెజారిటీ నియోజకవర్గాలు టిడిపి ఖాతాలో పడతాయి. కానీ 2019 ఎన్నికల్లో మాత్రం సీన్ మారింది. కమ్మల ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాల్లో సైతం వైసీపీకి అనుకూల ఫలితాలు వచ్చాయి. కానీ ఈసారి కమ్మ సామాజిక వర్గం నేతలు వైసీపీలో చేరుతుండడం విశేషం. ఇప్పటికే కొడాలి నాని, వల్లభనేని వంశీ మోహన్ లాంటి కమ్మ నేతలు ఉన్నారు. దేవినేని నెహ్రూ వారసుడు అవినాష్ సైతం ఆ పార్టీ గూటికి చేరారు. గుంటూరు జిల్లాలో సైతం ఆ సామాజిక వర్గ నేతలు యాక్టివ్ గా ఉన్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే విజయవాడ ఎంపీ కేశినేని నాని వైసీపీలో చేరనుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఈసారి అనూహ్యంగా రెడ్డి సామాజిక వర్గం టిడిపి వైపు చూస్తుండడం విశేషం. ఇప్పటికే ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వంటి నేతలు టిడిపిలో చేరారు. మరికొందరు నేతలు చేరుతారని ప్రచారం జరుగుతోంది. సామాజిక సమతుల్యత పేరిట జగన్ సొంత సామాజిక వర్గాన్ని పక్కన పెట్టడంతో.. చాలామంది రెడ్డి సామాజిక వర్గం నేతలు తెలుగుదేశం గూటికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీలో ఒక వెలుగు వెలిగిన నాయకులు సైతం టిడిపికి టచ్ లో ఉన్నట్లు సమాచారం. వైసీపీలో సీట్ల వ్యవహారం తేలేక చాలామంది నేతలు టిడిపిలోకి క్యూ కట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే కాపు సామాజిక వర్గం ఎక్కువగా జనసేన వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. టిడిపి, జనసేన పొత్తు కారణంగా కాపు సామాజిక వర్గం అధిక శాతం టికెట్లను ఆశిస్తోంది.

అయితే ఈ మూడు పార్టీలకు ఒక్కో సామాజిక వర్గం అండగా ఉంటూ వస్తోంది. అత్యధిక శాతం ఉన్న కాపులు, కమ్మ సామాజిక వర్గం ఏకతాటిపైకి వస్తే తమకు ఇబ్బందులు తప్పవని జగన్ భావిస్తున్నారు. అందుకే బీసీ, ఎస్సీ, ఎస్టి సామాజిక మంత్రాన్ని జపిస్తున్నారు. గతం నుంచి బీసీలు టిడిపి వెంట నడిచారు. కానీ గతసారి వారిలో జగన్ చీలిక తెచ్చారు. అయితే తాజాగా ఈ సరికొత్త సామాజిక సమీకరణలు, కొత్త లెక్కలు ఎవరికి విజయం కట్టబెడతాయో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular