Cow Urine Purchase: కొంతమంది ఎన్నో ఔషధ గుణాలు ఉంది అని చెప్తుంటారు. మరికొందరేమో అంతా చాదాస్తం అంటూ కొట్టిపారేస్తుంటారు. ఆవు మూత్రం గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఇలాంటి చర్చలు సాగుతూనే ఉంటాయి. ఒక మతానికి సంబంధించిన వారు.. ఒక వర్గానికి సంబంధించిన వారు ఆవును అత్యంత పవిత్రంగా భావిస్తూ ఉంటారు. మరికొందరేమో ఆవును ఒక సాధారణ జంతువు లాగానే చూస్తూ ఉంటారు.
భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆవులకు ప్రాధాన్యం ఏర్పడింది. ఆవు పాలకు.. ఆవు నెయ్యికి.. ఆవు మూత్రానికి డిమాండ్ పెరిగింది. సాధారణంగా గృహప్రవేశాల సమయంలో.. ఇతర వేడుకల సమయంలో ఆవులను తీసుకొస్తుంటారు. పైగా ఆవులను గోమహాలక్ష్మి లాగా భావిస్తూ ఉంటారు. ఆవులు అత్యంత శ్రేష్టమైనవని.. ఎంతో ప్రీతిపాత్రమైన జంతువులని నమ్ముతుంటారు. పురాణాలలో ఆవుల గురించి రకరకాల ప్రస్తావన ఉంది. చివరికి కామధేనువు అంటే ఆవేనని.. ఆవు శ్రీమహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన జంతువు అని పురాణాలలో పేర్కొన్నారు.
ఆవు పాలు ఔషధాల తయారీలో వాడుతుంటారు. ఆవు మూత్రాన్ని ఆయుర్వేద ఉత్పత్తుల తయారీలో ఉపయోగిస్తుంటారు. గో మయాన్ని పిడకలుగా చేసి విక్రయిస్తుంటారు. ప్రస్తుతం హైబ్రిడ్ ఆవులు పాల ఉత్పత్తిలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. అయితే నాటు ఆవులు అధికంగా పాలు ఇవ్వకపోయినప్పటికీ.. వాటి మూత్రంలో అద్భుతమైన ఔషధ విలువలు ఉంటాయి. ఇది శాస్త్రీయంగా నిరూపితమైంది కూడా. ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఆవుల మూత్రాన్ని సేకరించబోతోంది. గోవుల సంబంధించిన మూత్రాన్ని లీటర్ కు పది రూపాయల చొప్పున చెల్లించి కొనుగోలు చేయనుంది.. రైతుల నుంచి కొనుగోలు చేసిన ఆవుల మూత్రాన్ని వ్యవసాయ అవసరాలకు ముడి సరుకుగా వాడబోతోంది.
రసాయన ఎరువులు.. క్రిమిసంహారకాలు విపరీతంగా వాడుతున్న నేపథ్యంలో.. గోవుల మూత్రం ద్వారా సేంద్రీయ వ్యవసాయాన్ని బలోపేతం చేయాలని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది.. యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఈయనకు ఆవులు అంటే చాలా ఇష్టం. ఈయన ఆశ్రమంలో ఆవులు ఎక్కువగా ఉంటాయి. పైగా ఈయన ఆవుల మూత్రాన్ని తాగుతూ ఉంటారు. సేంద్రియ వ్యవసాయాన్ని ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉంటారు. అందువల్లే ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రైతులు పెంచే ఆవుల ద్వాారా సేకరించిన మూత్రంతో ఎరువులు, మందులు తయారు చేసి, సేంద్రియ వ్యవసాయాన్ని పెంపొందించే అవకాశం ఉందని తెలుస్తోంది.