Chandram Palem ZP High School: రాష్ట్రంలో కొన్ని ప్రభుత్వ పాఠశాలలు ప్రత్యేకమే. అటువంటి వాటిలో విశాఖ మధురవాడ సమీపంలోని చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఒకటి. తాజాగా ఈ పాఠశాల భవనాలు పునర్నిర్మాణం జరుపుకున్నాయి. నేడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించనున్నారు. ఈ పాఠశాలకు ప్రత్యేకమైన విజయ గాధ ఒకటి ఉంది. 1979లో కేవలం 100 మంది విద్యార్థులతో ప్రారంభం అయింది ఈ పాఠశాల. అటువంటిది నేడు నాలుగువేల మంది విద్యార్థులు ఆ పాఠశాలలో చదువుతున్నారు. రాష్ట్రంలోనే ఎక్కువ మంది విద్యార్థులు చదువుతున్న పాఠశాలగా రికార్డు సృష్టించింది. ప్రైవేటు తో పాటు కార్పొరేట్ విద్యాసంస్థలు రాజ్యమేలుతున్న తరుణంలో విశాఖలో ఉన్న ఈ పాఠశాల పై మాత్రం ఆదరణ తగ్గలేదు. ఇక్కడ అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులకు కడుతుంటారు. అయితే ఈ స్థాయిలో ఈ పాఠశాల ఎదుగుదల వెనుక ఉపాధ్యాయుల కృషి, విద్యాశాఖ తోడ్పాటు, స్వచ్ఛంద సంస్థల కృషి ఉంది.
* కూటమి వచ్చిన తర్వాత..
కూటమి వచ్చిన తర్వాత ఈ పాఠశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. గత రెండేళ్లుగా ఊహించని విధంగా విద్యార్థుల సంఖ్య పెరగడంతో వసతి సమస్య ఏర్పడింది. తరగతి గదులు చాలడం లేదు. మౌలిక వసతులకు సంబంధించి సమస్యలు మొదలయ్యాయి. పూర్వం చెరువు ప్రదేశంలో ఈ స్కూల్ ప్రాంగణం ఉండడంతో చిన్నపాటి వర్షం పడినా.. మైదానం మొత్తం బురదమయంగా మారి విద్యార్థులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. పాఠశాల సామర్థ్యానికి మించి అడ్మిషన్లు జరుగుతుండడం, డ్రైనేజీ సదుపాయాలు లేకపోవడం, డిజిటల్ విద్యకు తగిన సాంకేతిక మౌలిక వసతులు లేకపోవడం వల్ల చాలా రకాల ఇబ్బందులు ఎదురయ్యాయి.
* లోకేష్ ప్రత్యేక ఫోకస్..
రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత లోకేష్ ఈ పాఠశాల పరిస్థితిని తెలుసుకున్నారు. చంద్రం పాఠశాల అభివృద్ధి పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. పాఠశాల ప్రాంగణంలో నీరు నిలవకుండా డ్రైనేజీ, మైదానం అభివృద్ధి తో పాటు నూతన మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరు చేశారు. మరోవైపు కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద సయాంట్ ఫౌండేషన్ 8 కోట్ల రూపాయల అంచనా తో ముందుకు రాగా.. విశాఖ జిల్లాలోని 50 ప్రభుత్వ పాఠశాలలకు ఏఐ, స్టన్ రోబోటిక్స్ లాబ్లను ఏర్పాటు చేసే ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చేపట్టారు. అందులో చంద్రంపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్ ను ప్రధాన కేంద్రంగా చేసుకున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్లు, కంప్యూటర్ సెంటర్లు, డిజిటల్ క్లాస్ రూమ్లను సిద్ధం చేశారు. వాటిని ఈరోజు మంత్రి నారా లోకేష్ ప్రారంభించనున్నారు.
* అంతా డిజిటల్ బోధన..
ఈ పాఠశాలలో 62 తరగతి గదులు ఉన్నాయి. పూర్తిస్థాయిలో డిజిటల్ బోధన జరుగుతూ ఉంటుంది. మొత్తం 104 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. అధునాతన గ్రంథాలయం, నిపుణులతో వ్యక్తిత్వ వికాస్ శిక్షణ అందిస్తుంటారు. రాష్ట్రంలోనే అత్యధిక విద్యార్థులు కలిగిన పాఠశాల ఇది.ట్రిపుల్ ఐటీ లో ఎక్కువ సీట్లు సాధిస్తూ ఉంటారు ఇక్కడ విద్యార్థులు. అందుకే ఇక్కడ అడ్మిషన్లకు విపరీతమైన గిరాకీ. ఈ సంవత్సరం ఏకంగా 400 మంది విద్యార్థులు కొత్తగా పాఠశాలలో చేరారు. అటువంటి పాఠశాల పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు మంత్రి నారా లోకేష్.
View this post on Instagram