Chandrababu: ప్రతి నెలా మొదటి రోజు రావాల్సిన సామాజిక పెన్షన్.. మూడో తేదీ వచ్చినా లబ్ధిదారులకు అందలేదు. ఒకటో తేదీన ఉదయమే ఇంటికి వచ్చి వాలంటీరు పింఛన్ మొత్తాన్ని అందించేవారు. కానీ ఈ నెల రాకపోవడంతో పండుటాకులకు ఎదురుచూపులు తప్పడం లేదు. అయితే దీనికి కారణం మీరంటే మీరు అని అధికార వైసిపి, విపక్ష టిడిపి వాదులాడుకుంటున్నాయి. ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేకపోవడం వల్లే ఇవ్వడం లేదని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. అయితే వాలంటీర్ల పై ఈసీకి ఫిర్యాదు చేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందంటూ వైసీపీ ప్రత్యారోపణ చేస్తోంది. వాలంటీర్లు లేకపోవడం వల్లే తమకు పింఛన్ అందలేదని మెజారిటీ లబ్ధిదారులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఇది వైసీపీకి ప్రచారాస్త్రంగా మారింది. అందుకే వారు ఇంటా బయట ప్రచారం చేస్తున్నారు. పింఛన్ల పంపిణీని అడ్డుకున్నది ముమ్మాటికి టిడిపియేనని ఆరోపిస్తున్నారు. సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
మొన్నటి వరకు చంద్రబాబు జగన్ సంక్షేమ పథకాలను వ్యతిరేకించారు. ఉచిత పథకాలతో ఏపీ భవిష్యత్తును అంధకారంలో పెట్టారని ఆరోపణలు చేశారు. వాలంటీర్ వ్యవస్థ పై కూడా దుమ్మెత్తి పోశారు. అటు చంద్రబాబు అనుకూల మీడియా సైతం వలంటీర్ల వ్యవస్థ పై పెద్ద యుద్ధమే చేసింది. ఇటువంటి తరుణంలో వాలంటీర్లతో సంక్షేమ పథకాలు అమలు చేయవద్దంటూ ఎలక్షన్ కమిషన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థ ఫిర్యాదు మేరకు ఈసి స్పందించింది. అయితే చంద్రబాబుకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ సన్నిహితుడని.. చంద్రబాబు సూచన మేరకు నిమ్మగడ్డ రమేష్ ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేశారని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్తోంది.
ఈ తరుణంలో అధికార వైసిపి టిడిపిని టార్గెట్ చేసుకోవడాన్ని చంద్రబాబు గుర్తించారు. అందుకే హుటాహుటిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్దకు టిడిపి బృందాన్ని పంపించారు. తక్షణం పింఛన్లు పంపిణీ చేయాలని కోరారు. తాజాగా ఈ పింఛన్లకు సంబంధించి చంద్రబాబు ఎలక్షన్ కమిషన్కు ప్రత్యేక లేఖ రాశారు. ఎండలు ముదురుతున్న సమయంలో సచివాలయాల వద్దకు వచ్చి వృద్ధులు పింఛన్ తీసుకునేందుకు ఇబ్బంది పడతారని.. అందుకే ఇంటికి వెళ్లి పింఛన్ అందించే ఏర్పాట్లు చేయాలని లేఖలో కోరారు. అయితే ఇదంతా చంద్రబాబు భయంతోనే చేశారని.. దిద్దుబాటు చర్యలకు దిగారని తెలుస్తోంది. వాస్తవానికి ప్రభుత్వమే ఈనెల 3వ తేదీన పింఛన్లు పంపిణీ చేస్తామని ముందుగానే ప్రకటించింది. వాలంటీర్లతో పంపిణీకి ఏర్పాట్లు చేసింది. అయితే వాలంటీర్లను వినియోగించకూడదని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో దీనిని రాజకీయ అంశంగా మార్చుకోవాలని వైసిపి భావించింది. పింఛన్ల పంపిణీలో జాప్యానికి టిడిపి కారణమని కార్నర్ చేసింది. దాని నుంచి బయటపడేందుకు చంద్రబాబు పడరాని పాటలు పడుతున్నారు. దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు.