Chandrababu: తెలంగాణలో రేవంత్ అద్భుత విజయం సాధించారు. ఎక్కడో మూడో ప్లేస్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీని.. మొదటి స్థానంలోకి తేవడంలో సక్సెస్ అయ్యారు. అయితే దీని వెనుక సూపర్ సిక్స్ పథకాలతో పాటు కెసిఆర్ సర్కార్ పై వ్యతిరేకత పెంచడంలో రేవంత్ వ్యూహం ఫలించింది. ప్రజాకర్షక పథకాలతో ప్రజల్లోకి వెళ్లడంతో పాటు కెసిఆర్ సర్కార్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా వారి మనసును టర్న్ చేశారు. ప్రత్యామ్నాయంగా బిజెపి ఉన్నా.. దానిని అధిగమించి కాంగ్రెస్ వైపు తెలంగాణ ప్రజలను మరల్చడంలో రేవంత్ టీం చక్కగా పనిచేసింది. ఇప్పుడు అదే ఫార్ములాను రేవంత్ గురువు చంద్రబాబు ఏపీలో ప్రయోగిస్తున్నారు.
ముఖ్యంగా కర్ణాటకలో సూపర్ సిక్స్ పథకాలు సక్సెస్ అయ్యాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగింది. రేవంత్ సైతం తెలంగాణలో సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించారు. అక్కడ కూడా కాంగ్రెస్ సక్సెస్ అయింది. అందుకే చంద్రబాబు సైతం ఈ సూపర్ సిక్స్ పథకాలను ఏపీలో ప్రకటించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నెలకు 1500 రూపాయల నగదు సాయం వంటివి అందులో భాగమే. అదే సమయంలో అక్కడ కెసిఆర్ సర్కార్ పై మాదిరిగా.. ఇక్కడ జగన్ సర్కార్ పై ఒక రకమైన ప్రచారానికి తెర తీశారు. జగన్ పని అయిపోయిందంటూ ప్రచారం చేయడం ప్రారంభించారు. జూన్ 4 తర్వాత కుర్చీ ఖాళీ చేయాలన్న నినాదం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు.
రాజకీయ వ్యూహకర్తల సేవలను వినియోగించుకుంటున్నారు. తెలంగాణలో ప్రశాంత్ కిషోర్ శిష్యుడు సునీల్ కొనుగోలు సేవలను వినియోగించుకున్నట్లు మాదిరిగానే.. ఏపీలో మరో శిష్యుడు రాబిన్ శర్మ వ్యూహ చతురతను ఉపయోగించుకుంటున్నారు. నేరుగా ప్రశాంత్ కిషోర్ సలహాలు, సూచనలు పాటిస్తున్నారు. తెలంగాణలో ధరణి పోర్టల్ పై దుష్ప్రచారం చేయడంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయ్యింది. మీ ఆస్తులను దోచుకునేందుకే ధరణి పోర్టల్ తెచ్చారని కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగింది. ఇప్పుడు ఏపీలో సైతం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై అదే స్థాయిలో ప్రచారం చేయడంలో చంద్రబాబు, పవన్ సక్సెస్ అయ్యారు. పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ బొమ్మ ఉండడం, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో సైతం ఆయన ఫోటో కనిపిస్తుండడంతో ప్రజల్లో కూడా ఒక రకమైన అప నమ్మకం ఏర్పడింది. అందుకే భూ దోపిడీకి తెర తీశారని విపక్షాలు ఆరోపించడం ప్రారంభించాయి. ఇలా తెలంగాణలో రేవంత్ రెడ్డి మాదిరిగానే చంద్రబాబువ్యవహరిస్తుండడం విశేషం. ఎక్కడైనా గురువును శిష్యుడు అనుసరిస్తాడు. కానీ శిష్యుడు అనుసరించిన వ్యూహాన్ని ఇప్పుడు గురువు చంద్రబాబు పాటిస్తుండడం విశేషం.