CPI – CPM : అప్పట్లో.. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ అసెంబ్లీ జరుగుతోంది. కెసిఆర్ అప్పట్లో ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. పైగా అప్పుడు పారిశుధ్య కార్మికులు ధర్నాలు చేస్తున్నారు. కార్మికుల ధర్నాకు కమ్యూనిస్టులు సపోర్ట్ ఇస్తున్నారు.
అప్పట్లో తెలంగాణ రాష్ట్రంలో నిరసనలు.. ఉద్యమాలు జరిగితే కేసీఆర్ చిరాకుపడేవారు. సొంత మీడియాలో పిచ్చిపిచ్చిగా వార్తలు రాయించేవారు. పోలీసులను ముందు పెట్టి చర్యలు తీసుకునేవారు. చివరికి తానేరంగంలోకి దిగి అడ్డగోలుగా తిట్టి వెళ్ళిపోయేవారు. ఎందుకంటే కెసిఆర్ మాత్రమే ఉద్యమం చేయాలి. కెసిఆర్ మాత్రమే నిరసన చేపట్టాలి. తన పరిపాలన కాలంలో ఎవరైనా గొంతు ఎత్తితే కేసీఆర్ ఊరుకునేవారు కాదు. ఆర్టీసీ నుంచి మొదలుపెడితే విద్యార్థుల ఉద్యమం వరకు దేనిని కూడా కేసీఆర్ వదిలిపెట్టలేదు. పాతాళం దాకా తొక్కి వదిలిపెట్టాడు.
అప్పట్లో పారిశుధ్య కార్మికులు ఉద్యమాలు చేస్తుంటే కేసీఆర్ నిండు శాసనసభలో సూది దబ్బుణం పార్టీలు అంటూ ఎగతాళి చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులపాటు కమ్యూనిస్టుల మీద రకరకాలుగా ఒత్తిళ్లు తీసుకొచ్చారు. ఆ తర్వాత మునుగోడు ఉప ఎన్నిక రావడంతో కమ్యూనిస్టులకు ప్రగతిభవన్ గేట్లు తెరిచారు.. మునుగోడు లో గెలిచే వరకు కమ్యూనిస్టులను వాడుకున్నారు. ఆ తర్వాత దూరం పెట్టారు. 2023 ఎన్నికల్లో కనీసం పొత్తు పెట్టుకోవడానికి కూడా కేసీఆర్ ఎటువంటి సంకేతాలు కమ్యూనిస్టులకు పంపించలేదు. దీంతో గత్యంతరం లేక కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చారు. కాంగ్రెస్ పార్టీ కూడా అంతంతమాత్రంగా సీట్లు కేటాయించింది.
కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో నవతెలంగాణ అనే పేపర్ పబ్లిష్ అవుతూ ఉంటుంది. గత ఏడాది ఈ పేపర్ తన పదవ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. నాడు ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. పైగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం లో కమ్యూనిస్టులు కూడా ఉండడంతో.. నాడు రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరు కావడం పెద్ద ఆశ్చర్యమనిపించలేదు. కానీ ఇప్పుడు నవతెలంగాణ 11వ వార్షికోత్సవానికి భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హాజరయ్యారు. వచ్చారు కాబట్టి మీడియా స్వేచ్ఛ గురించి.. వార్తల గురించి.. నవతెలంగాణ గురించి.. కమ్యూనిస్టుల పోరాటాల గురించి ఆయన గొప్పగానే చెప్పారు..
ఇటీవల కాలంలో కేటీఆర్ నమస్తే తెలంగాణ కాకుండా వేరే పత్రిక అధికారిక కార్యక్రమానికి హాజరు కావడం ఇదే తొలిసారి. వాస్తవానికి కమ్యూనిస్టులలో తమ్మినేని వీరభద్రం.. కూనంనేని సాంబశివరావు.. ఇంకా కొంతమందితో కేటీఆర్ కు మంచి సంబంధాలే ఉన్నాయి. అందువల్లే ఆయన నవతెలంగాణ పదకొండవ వార్షికోత్సవానికి హాజరైనట్టు తెలుస్తోంది. అన్ని కలిసి వస్తే వచ్చే ఎన్నికల్లో కారులో సూది దబ్బుణం పార్టీలు కలిసి ప్రయాణించే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అందువల్లే కేటీఆర్ ను పిలిచారని.. పిలిచిన వెంటనే కాదనకుండా కేటీఆర్ కూడా వెళ్లిపోయారని.. గులాబీ పార్టీ నాయకులు నవతెలంగాణ కు భారీగానే జాకెట్ యాడ్స్ ఇచ్చారని ప్రచారం జరుగుతుంది. మునుగోడు ఉప ఎన్నికల్లో చేసిన సహకారం ఇప్పటికి గులాబీ అధిష్టానం మర్చిపోలేదని.. అందువల్లే కేటీఆర్ ఇప్పటినుంచే 2028 ఎన్నికలకు రోడ్డు మ్యాపు వేశారని తెలుస్తోంది.