Godavari Water : ఏపీలో మరో సుందర దృశ్యం ఆవిష్కృతం అయింది. ఉత్తరాంధ్రను సస్యశ్యామలం చేయాలన్న తలంపుతో గోదారమ్మ పరుగులు తీస్తోంది. పోలవరం ఎడమ కాలువ రెగ్యులేటర్ వద్ద గోదావరి జలాలకు సీఎం చంద్రబాబు జలహారతి ఇవ్వడంతో.. ఉరకలేస్తున్న ఉత్సాహంతో గోదావరి జలాలు ఉత్తరాంధ్రను తాకాయి. దీంతో ఉత్తరాంద్రుల చిరకాల వాంఛ నెరవేరింది. సీఎం చంద్రబాబు బుధవారం అనకాపల్లి జిల్లాలో పర్యటించారు.. పాయకరావుపేట నియోజకవర్గం లో ఈ గోదావరి జలాల ఉత్తరాంధ్ర ప్రవేశానికి శ్రీకారం చుట్టారు. రెండు రోజుల కిందట పశ్చిమ ప్రకాశం జిల్లాలో వెలుగొండ సాగునీటి ప్రాజెక్టును ప్రారంభించి.. కరువు సీమకు కృష్ణా జలాలను పంపించారు. ఇప్పుడు ఉత్తరాంధ్రకు గోదారమ్మ జలాలను తరలించి ప్రజల అభినందనలను అందుకుంటున్నారు.
* పాయకరావుపేట నియోజకవర్గం లో..
అనకాపల్లి జిల్లాలో పర్యటించారు సీఎం చంద్రబాబు. పాయకరావుపేట నియోజకవర్గంలో పోలవరం ఎడమ కాలువ రెగ్యులేటర్ వద్ద గోదావరి జలాలకు సీఎం చంద్రబాబు జలహారతి ఇచ్చారు. పోలవరం ఎడమ కాలువ రెగ్యులేటర్ ఆన్ చేసి అధికారికంగా ఉత్తరాంధ్రకు నీళ్లు విడుదల చేశారు. అనంతరం పాయకరావుపేట బహిరంగ సభలో సీఎం పాల్గొన్నారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తన జీవితం లక్ష్యం నెరవేరుతోందని చెప్పారు. ఈ రాష్ట్ర అభివృద్ధికి తాను తలచిన ఒక్కో ప్రాజెక్టు ప్రారంభోత్సవం కావడం చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చారు. యాడాదిలోనే అనకాపల్లికి గోదావరి జలాలు అందిస్తామన్న హామీ నెరవేర్చిన విషయాన్ని గుర్తు చేశారు.
* దశాబ్దాల కల..
ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు అనేవి దశాబ్దాల కల. ఎట్టకేలకు అది నెరవేరింది. ఎడమ కాలువ ద్వారా 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు, 5.23 లక్షల మందికి తాగునీరు అందనుంది. పంపా, తాండవ, వరాహ, శారదా నదులపై అక్విడెక్టులు, సైఫన్ల నిర్మాణం పూర్తయింది. పంపానదిపై 30 మీటర్ల లోతులో 312 ఫైల్స్ తో భారీ అక్విడెక్ట్ నిర్మాణం జరిగింది. తాండవ నదిపై 6 వెంట్లతో 447 మీటర్ల పొడవున అక్విడెక్టులను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు ఎడమ కాలువ నిర్మాణం కోసం దాదాపు రూ.4192 కోట్లను ఖర్చు చేశారు. అనకాపల్లి జిల్లాలో 1.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు.. 110 చెరువులకు నీటి సరఫరా కానుంది. అటువంటి ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు తన జన్మ ధన్యమైందని చెప్పారు.