Botsa Satyanarayana: వైసీపీలో బొత్సను పక్కన పెడతారా? శాసనమండలి లో విపక్ష నేత పదవి నుంచి తప్పిస్తారా? కొత్త వ్యక్తికి ఆ పదవి అప్పగిస్తారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల బీజేపీకి చెందిన ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కాపులకు ప్రాధాన్యత లేదని విమర్శించారు. సీనియర్ నేత బొత్స సత్యనారాయణకు ప్రాధాన్యత తగ్గించేసారని ఆరోపించారు. కేవలం అనారోగ్య పరిస్థితులు కారణంగా ఆయనను తప్పిస్తారని కూడా గత కొద్దిరోజులుగా ప్రచారం సాగుతోంది. ఆ పదవిని ఓ మహిళా నేతతో భర్తీ చేస్తారని కూడా టాక్ నడుస్తోంది. గతంలో రెండు సార్లు శాసనమండలిలోనే బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే.
* తగ్గిన యాక్టివ్..
అయితే జగన్మోహన్ రెడ్డితో బొత్స కలిసింది తక్కువ అని తెలుస్తోంది. గతం మాదిరిగా బొత్స యాక్టివ్ గా ఉండడం లేదని కూడా ప్రచారంలో ఉంది. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. సొంత నియోజకవర్గ చీపురుపల్లిలో ప్రభుత్వం పై ఆందోళన కార్యక్రమంలో మాట్లాడుతుండగా కుప్పకూలిపోయారు. ఆ సమయంలోనే బొత్స అనారోగ్యంపై రకరకాల ప్రచారం నడిచింది. అయితే తరువాత యాక్టివ్ అయ్యారు. కానీ శాసనమండలిలో సైతం అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. అయితే ఆయన ఆరోగ్య రీత్యా రాజకీయాల నుంచి తప్పించాలని కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డిని కోరినట్లు వార్తలు వచ్చాయి. అటు తర్వాత మళ్లీ కోలుకున్న బొత్స యాక్టివ్ అయ్యారు. మొన్నటికి మొన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కాపు నేతల సమావేశాల్లో కూడా పాల్గొన్నారు. అయితే క్రియాశీలక రాజకీయాలనుంచి ఆయన తప్పుకుంటారు అన్న ప్రచారం పొలిటికల్ వర్గాల్లో ఉంది.
* తగ్గుతున్న పట్టు..
బొత్స మునుపటి మాదిరిగా రాజకీయాలు చేయలేకపోతున్నారు. ఆయన కుటుంబానికి సైతం రాజకీయ పట్టు తగ్గుతోంది. మొన్నటికి మొన్న విజయనగరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ భవన వివాదం తలెత్తింది. ప్రైవేటు స్థలంలో వైసీపీ కార్యాలయ భవనం ఏర్పాటు చేశారనేది ప్రధాన ఆరోపణ. ముఖ్యంగా పూసపాటి రాజవంశీయుల ప్రైవేటు భూమిని ప్రభుత్వ భూమిగా మార్చి.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 33 సంవత్సరాల పాటు లీజుకు ఇవ్వడం జరిగింది. దీనిపై రాజవంశీయుడిగా అశోక్ గజపతిరాజు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. అది ప్రైవేటు భూమి అని తేలితే కచ్చితంగా కార్యాలయ భవనాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రస్థాయిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇది డ్యామేజ్ కలిగించే విషయం. అయితే బాధ్యతాయుతమైన మంత్రి స్థానంలో ఉంటూ అప్పట్లో బొత్స నిర్లక్ష్యంగా వ్యవహరించారని జగన్మోహన్ రెడ్డి ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తోంది. ఒకవైపు అనారోగ్యం, ఇంకోవైపు బొత్స ఫ్యామిలీ పట్టు తగ్గడంతో జగన్ పునరాలోచనలో పడినట్లు సమాచారం. అందుకే శాసనమండలి విపక్ష నేత పదవి నుంచి ఆయనకు సాగనంపుతారని తెలుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.

