Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్లో టికెట్ల పంచాయతీ టీడీపీ-బీజేపీ-జనసేన కూటమిలో ప్రకంపనలు సృష్టిస్తోంది. టీడీపీ ప్రకటించిన రెండో జాబితా ఆ పార్టీలో మంటలు రేపగా, సీనియర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గంటా శ్రీనివాస్రావు, సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, జవహర్, కళావెంకట్రావుతోపాటు పలువురు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మరోవైపు కూటమిలోని జనసేన పార్టీలోను అదే పరిస్థితి కనిపిస్తోంది. రెండు పార్టీల నేతలు బహిరగంగానే తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీలో అసంతృప్త జ్వాలలు..
టీడీపీ ప్రకటించిన రెండో జాబితాతో ఆ పార్టీలో ముసలం పుట్టింది. అసంతృప్త జ్వాలలు ఎక్కువయ్యాయి. సీనియర్ నాయకులు బండారు సత్యనారాయణ మూర్తి, నాగేశ్వరరావు, బోడే ప్రసాద్, వర్మ, గంటా శ్రీనివాసరావు , గండి బాబ్జీ, పాసర్ల ప్రసాద్, జవహర్ వంటి సీనియర్ నేతలకు టికెట్ల దక్కలేదు. వీరంతా బహిరంగంగానే టీడీపీ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జవహర్ రెబల్గా పోటీకి సిద్ధమవుతున్నారు. గంటా శ్రీనివాస్రావు భవిష్యత్ కార్యాచరణపై అనుచరులతో సమావేశమయ్యారు. కొంతమంది ఇప్పటికే టీడీపీని వీడారు.
జనసేనలోనూ..
ఇక జనసేన పార్టీలోనూ అసంతృప్త నేతల పెరుగుతున్నారు. ఇచ్చిన 24 సీట్లలో 6 స్థానాలకు మాత్రమే పవన్ కళ్యాణ్ అభ్యర్థులను ప్రకటించారు. ఈ క్రమంలో పార్టీ కీలక నేత బొలిశెట్టి సత్యనారాయణ టికెట్ దక్కలేదు. దీంతో ఆయన పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. దశాబ్డంగా సమయాన్ని, ధనాన్ని వెచ్చించినా తనకు పోటీ చేసే అవకాశం ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కనీసం పిలిచి మాట్లాడడం లేదని కూడా పేర్కొన్నారు. తాజాగా జనసేన పార్టీకి మరో షాక్ తగిలింది. మరో కీలక నేత జనసేనకు రాజీనామా చేశారు. అనకాపల్లి నియోజకవర్గ ఇన్చార్జి పరుచూరి భాస్కరరావు పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఎమ్మెల్యే టికెట్ కోసం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని, తీవ్ర నిరాశ చెందానని పేర్కొన్నారు. ఈ పరిస్థితిలో జనసేనను వీడడమే ఉత్తమమని భావించినట్లు తెలిపారు. అనకాపల్లి టికెట్ను ఇటీవల పార్టీలో చేరిన కొణతాల రామకృష్ణకు కేటాయించడంతోనే పరుచూరి భాస్కరరావు జనసేనకు గుడ్ బై చెప్పారు. త్వరలోనే తన భవిష్యత్తు రాజకీయ కార్యాచరణను ప్రకటిస్తానని తెలిపారు. జనసేనకు ఇంకా 18 టికెట్లు ప్రకటించాల్సి ఉంది. మొత్తం టికెట్లు ప్రకటించిన తర్వాత మరింత మంది అసంతృప్తితో పార్టీ వీడడం ఖాయం అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.