India Today CVoter Survey : ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతోంది. 27 నెలలు పూర్తవుతోంది. సాధారణంగా ప్రభుత్వం పై వ్యతిరేకత అనేది కామన్. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం తమదే అధికారం అంటూ ప్రకటనలు చేస్తోంది. ఇటీవల ఊరు పేరు తెలియని ఓ సంస్థ పేరుతో సర్వే ఒకటి బయటకు వచ్చింది. ఇప్పుడు ఎన్నికలు జరిగితే కూటమి కంటే వైసీపీకే ఎక్కువగా ప్రజలు పట్టం కడతారన్నది ఆ సర్వే సారాంశం. దానిని పట్టుకుని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారంతో అదరగొట్టింది. అయితే వారి ఆనందం ఎంతసేపు నిలవలేదు. జాతీయస్థాయిలో ఇండియా టుడే- సి ఓటర్ సర్వే ఒకటి బయటకు వచ్చింది. జాతీయస్థాయిలో ఎన్డీఏకు స్వల్ప తగ్గుదల తప్పించి.. అధికారంలోకి మరోసారి వస్తుందని తేల్చి చెప్పింది. ఇప్పటికీ ఇప్పుడు ఎన్నికలు జరిగితే మళ్లీ ఎన్ డి ఏదే అధికారం అని స్పష్టం చేసింది. పనిలో పనిగా ఏపీ విషయంపై కూడా స్పష్టత ఇచ్చింది.
* తగ్గనున్న ఒక్క ఎంపీ సీటు..
జాతీయస్థాయిలో పార్లమెంట్ స్థానాల వారీగా ఇండియా టుడే సి ఓటర్ సర్వే సాగింది. గడిచిన ఎన్నికల్లో ఎన్డీఏ ఇక్కడ 21 పార్లమెంట్ సీట్లను గెలుచుకుంది. తెలుగుదేశం పార్టీ అత్యధికంగా 16 ఎంపీ సీట్లను సాధించింది. ఇక జనసేన రెండు స్థానాల్లో గెలవగా.. ఆరు చోట్ల పోటీ చేసిన బిజెపి మూడు చోట్ల గెలిచింది. అయితే ఏపీలో 20 ఎంపీ సీట్లను మళ్లీ కచ్చితంగా గెలుచుకుంటుందని ఇండియా టుడే సి ఓటర్ సంస్థ తేల్చి చెప్పింది. ఓడిపోయిన ఆ ఒక్క సీటు సైతం బిజెపి దేనని స్పష్టతనిచ్చింది. తద్వారా మరోసారి ఏపీలో టిడిపి కూటమికి తిరుగు లేదని స్పష్టమైంది.
* ఉత్తరాదిలో ప్రతికూలత..
వాస్తవానికి ఉత్తరాది రాష్ట్రాల్లో బిజెపి పై ప్రతికూలత ప్రారంభం అయింది అని ఈ సర్వే తేల్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓ 30 పార్లమెంటు సీట్లను బిజెపి కోల్పోవాల్సి ఉంటుందని కూడా ఈ సర్వే హెచ్చరించింది. కానీ ఏపీలో మాత్రం బిజెపి ఒక్క సీటు కోల్పోగా.. ఎన్డీఏ పరంగా మిగతా 20 సీట్లను సాధిస్తుందని తేల్చి చెప్పింది. మొన్నటి ఎన్నికల్లో బిజెపి పొత్తులో భాగంగా అనకాపల్లి, రాజమండ్రి, నరసాపురం పార్లమెంట్ స్థానాలను గెలుచుకుంది. ఈ మూడిట్లో ఒకటి కోల్పోవడం ఖాయమని ఈ సర్వే చెబుతోంది. టిడిపి తో పాటు జనసేన బలం తగ్గదని తేలిపోయింది. అయితే ఏదేదో ప్రచారం చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి.. ఇది మింగుడు పడని విషయం గా మారింది.