Indian student : అగ్రరాజ్యం అమెరికాలో భారతీయుల మరణాలు కొనసాగుతున్నాయి. మరో విద్యార్థి కనిపించకుండా పోయి.. చివరకు శవమై కనిపించాడు. ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్లిన హైదరాబాద్ యువకుడు అర్ఫాత్ మృతదేహాన్ని క్లీవ్ లాండ్ అక్కడి పోలీసులు గుర్తించారు. ఈమేరకు హైదరాబాద్లోని అతడి తల్లిదండ్రులకు న్యూయార్క్లోని భారతీయ ఎంబసీ ద్వారా సమాచారం అందించారు. అర్ఫాత్ కుటుంబ సభ్యులకు సంతాపం తెలుపుతూ ఎక్స్లో ట్వీట్ చేసింది. ‘ఈ అనుమానాస్పద మరణంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, వారితో నిత్యం టచ్లో ఉంటామని ఎంబసీ అధికారులు పేర్కొన్నారు. కాగా, అర్ఫాత్ మరణంతో అమెరికాలో ఈ ఏడాది చనిపోయిన విద్యార్థుల సంఖ్య 11కు చేరింది.
ఎంఎస్ చేయడానికి..
మహమ్మద్ అబ్దుల్ అర్ఫాత్ ఎంఎస్ చదవడానికి గతేడాది అమెరికా వెళ్లాడు. ఓహియోలోని క్లీవ్ లాండ్ యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేస్తున్నాడు. ఇక అర్ఫాత్ మూడు వారాల నుంచి తమకు ఫోన్ చేయడం లేదని, సహచర విద్యార్థులకు ఫోన్ చేస్తే కనిపించడం లేదని చెప్పారని హైదరాబాద్లోని ఆయన తల్లిదండ్రులు పేర్కొన్నారు. తోటి విద్యార్థుల సాయంతో క్లీవ్ లాండ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు. ఇదిలా ఉండగా ఇటీవల తన కొడుకును కిడ్నాప్ చేశామని, 1,200 డాలర్లు చెల్లిస్తే విడిచిపెడతామని బెదిరింపు కాల్ వచ్చిందని అర్ఫాత్ తండ్రి చెప్పారు. ఈ విషయాన్ని న్యూయార్క్లోని భారత రాయబార కార్యాలయం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.
గాలించినా ప్రయోజనం లేక..
మరోవైపు అమెరికా పోలీసులు అర్ఫాత్ కోసం విస్తృతంగా గాలించారు. కానీ ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. ఈ క్రమంలో సోమవారం అర్ఫాత్ మృతదేహాన్ని క్లీవ్ లాండ్లో గుర్తించినట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది. అర్ఫాత్ మరణంపై క్లీవ్ లాండ్ పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారని పేర్కొంది. వరుస ఘటనలతో అమెరికాలో చదువుతున్న తెలుగు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.