Homeఅంతర్జాతీయంChandrayaan 3 : చంద్రయాన్_3 విజయవంతం: తెల్లోల్ల లేకి బుద్ది

Chandrayaan 3 : చంద్రయాన్_3 విజయవంతం: తెల్లోల్ల లేకి బుద్ది

Chandrayaan 3 : వ్యాపారం చేసుకుంటామంటూ బతిమాలి భారత్‌లోకి అడుగుపెట్టి.. ఆపై దేశాన్ని దురాక్రమించిన ఆంగ్లేయులు మన చంద్రయాన్‌-3 విజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇస్రో ప్రయోగించిన విక్రమ్‌ ల్యాండర్‌ సురక్షితంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన వార్త తెలియగానే.. బ్రిటిషర్లు ట్విటర్‌, ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాల సాక్షిగా తమ అక్కసు వెళ్లగక్కడం మొదలుపెట్టారు. 2016 నుంచి 2021 దాకా బ్రిటన్‌ నుంచి భారతదేశానికి 2.3 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.23 వేల కోట్ల) సొమ్ము ఎయిడ్‌ (సాయం) రూపంలో వచ్చిందని.. చంద్రుడిపైకి వ్యోమనౌకలను పంపగల దేశానికి బ్రిటిష్‌ ట్యాక్స్‌ పేయర్లు చెల్లించిన డబ్బును ఎందుకు సాయంగా పంపాలని.. పలువురు బ్రిటిషర్లు ప్రశ్నిస్తున్నారు. మరీ ముఖ్యంగా.. ‘చంద్రయాన్‌ 3 విజయం నేపథ్యంలో భారత్‌ ఇక విదేశీ సాయం కోరకూడదు.. ఇప్పటిదాకా ఇచ్చిన సొమ్మును తిరిగి తీసుకోవాలి’ అంటూ జీబీ న్యూస్‌ చానల్‌కు చెందిన ప్యాట్రిక్‌ క్రిస్టీస్‌ అనే యాంకర్‌, సోఫీకార్కోరన్‌ అనే మరో జర్నలిస్ట్‌ ‘ఎక్స్‌’లో చేసిన ట్వీట్లు విస్తృతంగా వైరల్‌ అయ్యాయి. ఆ దేశానికి చెందిన పలువురు యాంకర్లు, జర్నలిస్టులు ఇదే తరహాలో వ్యాఖ్యలు చేశారు. దీంతో వేలాదిమంది భారతీయులు వారికి దీటుగా సమాధానమిచ్చారు.

45 లక్షల కోట్ల డాలర్ల సొమ్ము

భారత్‌ను దురాక్రమించిన బ్రిటన్‌ 1765 నుంచి 1938 నడుమ 45 లక్షల కోట్ల డాలర్ల సొమ్మును ఇక్కడి నుంచి తరలించుకుపోయిందని.. దాంతో పోలిస్తే ఇప్పుడు ‘ఎయిడ్‌’ రూపంలో ఇస్తున్నది పిసరంతేనని నిప్పులు చెరిగారు. మరికొందరేమో.. ‘ఎయిడ్‌’ పేరిట భారతదేశానికి యూకే ఇస్తున్న సొమ్ము 2015 నుంచే ఆగిపోయిందని, 2016 నుంచి 2021 నడుమ ఇచ్చిన ఎయిడ్‌గా చెప్పుకొంటున్న సొమ్ము ఇక్కడ పెట్టుబడుల రూపంలో పెట్టింది, మత మార్పిడుల కోసం కొన్ని ఎన్జీవోలకు ఇచ్చిన సొమ్మని కౌంటర్‌ ఇచ్చారు. ఇందుకు రుజువుగా వారు 2015లో.. బ్రిటన్‌ సాయం మాకొద్దు పొమ్మని అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ ఇచ్చిన ప్రకటన తాలూకూ లింకులను కూడా పోస్ట్‌ చేశారు.

కాగా, బ్రిటన్ బుద్ది ఇలా ఉంటే..
చంద్రుడి దక్షిణ ధ్రువం మీద ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్_3 సురక్షితంగా దిగడాన్ని ప్రపంచ దేశాలు మొత్తం కీర్తించాయి. ఇతర దేశాలకు సాధ్యం కాని ఘనతను భారత్ సొంతం చేసుకోవడం పట్ల అభినందనలు కురుస్తోంది. ఇలాంటి అసాధ్యాన్ని భారత్ సుసాధ్యం చేసిన నేపథ్యంలో అమెరికా నుంచి మొదలు పెడితే అన్ని దేశాల ప్రధాన పత్రికలు పతాకస్థాయి శీర్షికలతో గురువారం ప్రత్యేక కథనాలను ప్రచురించాయి. ఇది భారతదేశం సాధించిన అపూర్వ విజయమని కొనియాడాయి. గతంలో మంగళయాన్ మిషన్ ను ఉద్దేశించి వ్యంగ్యమైన కార్టూన్ ప్రచురించిన న్యూయార్క్ టైమ్స్ కూడా భారతదేశానికి ఇది అతి పెద్ద విజయం అని కొనియాడింది. వాషింగ్టన్ పోస్ట్ రెండు కథనాలను, మహత్తరమైన వ్యాసాన్ని ప్రచురించింది. ఇది భారతదేశానికి చారిత్రాత్మక విజయం అని పేర్కొన్నది.

చంద్రుడి పైకి భారత్ చేరుకుంది

ఇక ప్రఖ్యాత ది వాల్ స్ట్రీట్ జర్నల్ చంద్రయాన్_3 ప్రయోగం విజయవంతం కావడం పట్ల హర్షం వ్యక్తం చేసింది. ఇది భారత్ కు చారిత్రాత్మక విజయం అని పేర్కొన్నది. చంద్రుడి దక్షిణ ధ్రువం పై భారత్ చారిత్రాత్మక ల్యాండింగ్ చేసిందని బిబిసి కొనియాడింది. 21వ శతాబ్దంలో చంద్రుడి మీద చైనా తర్వాత అడుగుపెట్టిన రెండవ దశంగా భారత్ అవతరించిందని వివరించింది. ఇక సీఎన్ఎన్ అయితే సరికొత్త కథనాలను ప్రచురించింది. చంద్రుడి మీద భారత్ సరికొత్త చరిత్ర లిఖించిందని కీర్తించింది. అంతరిక్ష రంగంలో ఆధిపత్యం కోసం పోటీపడే దేశాల జాబితాలో భారత్ ను అగ్రస్థానంలో నిలిపే విధంగా ఇస్రో ప్రయోగాలు చేస్తూందని బిబిసి సైన్స్ ఎడిటర్ రెబెక్కా మోరల్ వ్యాఖ్యానించారు. శాంతియుత ప్రయోజనాలకు అంతరిక్షాన్ని వాడుకోవడంలో భారత్ పెద్ద విజయం సాధించిందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ పేర్కొన్నారు. ఈ మిషన్ లో తాము కూడా భాగస్వామి కావడం అందంగా ఉందని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలహరిస్ పేర్కొన్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular