Rega Kantha Rao: అప్పట్లో కేంద్రమంత్రి కుమారుడు మీద దారుణానికి పాల్పడినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన మీద కేసులు కూడా నమోదు అయ్యాయి ఆయన జైలుకు కూడా వెళ్లి వచ్చారు. ప్రస్తుతం బెయిల్ మీద బయట ఉన్నారు.
ఈ వ్యవహారం మీద బీఆర్ఎస్ నాయకులు విపరీతంగా ఆందోళన చేశారు. కేంద్రమంత్రి రాజీనామా చేయాలని.. ఆయనను మంత్రివర్గం నుంచి తప్పించాలని డిమాండ్ కూడా చేశారు. భారత రాష్ట్ర సమితి లో కీలక నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. సత్యవతి రాథోడ్.. ఇంకా కొంతమంది కీలక నాయకులు రోజుల తరబడి విలేకరుల సమావేశం నిర్వహించి.. కేంద్ర మంత్రి కుమారుడికి వ్యతిరేకంగా మాట్లాడారు.
భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అయితే కేంద్ర మంత్రిని వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేశారు. తన పార్టీకి సంబంధించిన మీడియాలో అడ్డగోలుగా మాట్లాడారు. ఆ తర్వాత ఈ వ్యవహారంలో ప్రభుత్వం ప్రవేశించి.. చేయాల్సిన పని చేసేసింది. కేంద్ర మంత్రి కుమారుడిని అరెస్ట్ చేసింది. ఆ తర్వాత అతడిని జైలుకు పంపించింది. ప్రస్తుతం అతడు బెయిల్ మీద బయటకు వచ్చాడు.
కాలం గిర్రున తిరిగింది. ఇప్పుడు భారత రాష్ట్ర సమితి తల వంపులకు గురికావాల్సి వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు.. పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఓ యువతిపై దారుణంగా ప్రవర్తించాడని.. పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని.. చివరికి బెదిరింపులకు పాల్పడుతున్నాడని అభియోగాలు నమోదు అయ్యాయి.
తనను లైంగికంగా వేధిస్తున్నాడని.. బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఓ యువతి ఫిర్యాదు చేయడంతో పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. యూట్యూబ్ ఛానల్ నిర్వహించడం.. వ్యాపార వ్యవహారాలు సాగించడం వంటి వాటి పేరుతో ఆ యువతితో రేగ కాంతారావు పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత ఆమె మీద అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ నేపథ్యంలో ఆ యువతి రేఖ కాంతారావు మీద ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు విచారణ ప్రక్రియను వేగవంతం చేశారు.
ఆ ఫిర్యాదులో ఉన్న వివరాల ఆధారంగా.. సదరు యువతిని కాంతారావు వివాహం చేసుకుంటారని చెప్పాడు. ఆమె వద్ద ఉన్న ప్రైవేటు ఫోటోలను చూపిస్తూ బెదిరింపులకు పాల్పడ్డాడు. స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలంటూ ఆమె దగ్గర నుంచి దాదాపు నాలుగు లక్షల వరకు తీసుకున్నాడు. వాటిని తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడు. పైగా అతడి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆ మహిళ వాపోతోంది. తనకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆమె కోరుతోంది. ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ అనంతరం పంజాగుట్ట పోలీసులు కాంతారావు మీద రకరకాల సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు. క్షేత్రస్థాయిలో ఆధారాలు.. డిజిటల్ ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు.
భారత రాష్ట్ర సమితికి సంబంధించి ఒక కీలక నాయకుడి మీద ఈ స్థాయిలో ఆరోపణలు రావడంతో తెలంగాణ రాజకీయాలలో కలకలం నెలకొంది. ఇటీవల కాలంలో కేంద్రమంత్రి కుమారుడి మీద తీవ్రస్థాయిలో మండిపడిన భారత రాష్ట్ర సమితి నాయకులు దీనిపై ఏం సమాధానం చెప్తారో చూడాలని బిజెపి నాయకులు అంటున్నారు. మొన్నటిదాకా ఆకాశమంత ఎగిరిన కేటీఆర్ కాంతారావు మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉందని వారు చెబుతున్నారు.