HomeతెలంగాణPM Modi: తెలంగాణ రైతుకు ప్రధాని కితాబు.. వర్చువల్ గా మాట్లాడిన మోదీ!

PM Modi: తెలంగాణ రైతుకు ప్రధాని కితాబు.. వర్చువల్ గా మాట్లాడిన మోదీ!

PM Modi: భారత ప్రధాని నుంచి కరీంనగర్‌ జిల్లా చొప్పదండి రైతుకు ప్రశంసలు దక్కాయి. వికసిత భారత్‌ సంకల్ప యాత్రలో భాగంగా కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మార్కెట్‌ యార్డు రోడ్డులో అధికారులు గురువారం సభ నిర్వహించారు. వర్చువల్‌గా ప్రధాని మోదీ మండలంలోని పెద్దరూర్మపల్లి గ్రామానికి చెందిన రైతు మావురం మల్లికార్జున్‌రెడ్డితో మాట్లాడారు. రెండేళ్ల క్రితం ఆయన ఐకార్‌ సంస్థ అందించిన జాతీయ ఉత్తమ రైతు అవార్డుకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ మల్లికార్జున్‌ చేసే ఇంటిగ్రేటెడ్‌ ఫార్మింగ్‌ను విశ్వ విద్యాలయాలలో నిర్వహించే సెమినార్‌లలో యువతకు స్వయం అభివృద్ధి పథకాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సూచించారు. వ్యవసాయంలో భర్తకు చేదోడు వాదోడుగా నిలుస్తున్న మల్లికార్జున రెడ్డి భార్య లాంటి వారు భారత నారీ శక్తులని అభివర్ణించారు. ఇటువంటి ఉన్నత విద్యావంతులు మరెందరికో ఆదర్శం కావాలని సూచించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా కల్పిస్తున్న పలు పథకాలను ప్రధాని వివరించారు. వ్యవసాయ రుణాలపై బ్యాంకుల్లో వేస్తున్న వడ్డీపై ప్రధాని వివరాలు అడుగగా, సాలీనా ఏడు శాతం వడ్డీ వేస్తున్నారని తెలుపడంతో, ఇది మూడు శాతమేనని, మళ్లీ బ్యాంకులో సంప్రదించి తెలుసుకోవాలని సూచించారు. మల్లికార్జున్‌రెడ్డి భార్య, పిల్లలతో మోదీ మాట్లాడారు.

ఐటీ జాబ్‌ వదిలి వ్యవసాయం..
మావురం మల్లికార్జున్‌రెడ్డి ప్రధానమంత్రితో పర్చువల్‌ విధానంలో మాట్లాడే అవకాశం రావడంతో అందరి దృష్టి ఆయనపై పడింది. బీటెక్‌లో కంప్యూటర్‌ సైన్స్‌ చదివిన మల్లికార్జున్‌రెడ్డి హైదరాబాద్‌లో ఐటీజాబ్‌ చేసేవాడు. ఆయన భార్య సంధ్య ఎంబీఏ చదువుకుంది. ఓ ప్రైవేటు కంపెనీలో హెచ్‌ఆర్‌గా పనిచేసేంది. దంపతులిద్దరూ ఉద్యోగం వదిలేసి స్వగ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో ప్రకృతి వ్యవసాయానికి నడుం బిగించారు. విజయం సాధించారు. ఏటా రూ.పది లక్షల వరకు ఆదాయం పొందేలా విభిన్న వ్యవసాయం చేస్తు ఆదర్శంగా నిలుస్తుండగా, దేశంలోని అయిదు రాష్ట్రాల్లోని ఒక్కొక్కరితో మాట్లాడే విధానంలో తెలంగాణ నుంచి కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మండలానికి చెందిన మల్లికార్జున్‌రెడ్డికి ప్రధానితో మాట్లాడే అవకాశం దక్కింది.

మర్చిపోలేని అనుభూతి..
దేశ ప్రధాని నరేంద్రమోదీతో మాట్లాడే అవకాశం రావడం మరిచిపోలేని అనుభూతి అని మల్లికార్జున్‌రెడ్డి అన్నారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వదిలేసి స్వగ్రామంలో తాను చేస్తున్న ప్రకృతి వ్యావసాయాన్ని గుర్తించిన అధికారులు ఈ అవకాశం కల్పించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. వికసిత్‌ భారత్‌ యాత్రతో కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఎక్కువగా తెలిసివస్తున్నాయి. గతంలో నాకు కూడా ఈ పథకాలు తెలిసేది కాదని తెలిపాడు. తాను సాయిల్‌ హెల్త్‌ కార్డు తీసుకోవడం ద్వారా భూసార పరీక్ష చేయించి అనువైన పంటలు వేసుకొని తక్కువ పెట్టుబడి, ఎక్కువ దిగుబడి, ఎక్కువ ఆదాయం పొందుతున్నట్లు వెల్లడించాడు. పీఎం కృషి సంచాయి యోజన కార్డు, పీఎం కిసాన్‌ క్రెడిట్‌ కార్డు తనకు ఉపయోగపడ్డాయని తెలిపారు. కిసాన్‌ కార్డు ద్వారా తీసుకున్న లోన్‌ ఏడాది లోపు చెల్లించక పోవడం ఏడు శాతం వడ్డీ పడటంతో ప్రదానితో చెప్పానని వెల్లడించాడు. ఆయన భార్య సంధ్య మాట్లాడుతూ ప్రధాని మోదీ తనను నారీశక్తిగా అభివర్ణించడం మర్చిపోలేనన్నారు. మోదీ మాతో మాట్లాడతారని ఊహించలేదని తెలిపారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular