Telangana Politics : రేవంత్ రెడ్డి వచ్చేదాకా కాంగ్రెస్ పార్టీ సరైన సవాల్ కెసిఆర్ కు విసర లేకపోయింది. కెసిఆర్ కొడుతుంటే పడింది. కెసిఆర్ తిడుతుంటే పడింది. కెసిఆర్ తొక్కుతుంటే పాతాళం దాకా వెళ్ళిపోయింది. అంతేతప్ప కేసీఆర్ కు కౌంటర్ ఇచ్చే సాహసం కాంగ్రెస్ పార్టీ చేయలేకపోయింది.
తెలంగాణ ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రెండు పర్యాయాలు అధికారంలోకి రాలేకపోయింది అంటే ఆ పార్టీలో నాయకత్వ లోపం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. చివరికి రేవంత్ రెడ్డి వచ్చేదాకా కాంగ్రెస్ పార్టీలో నిస్తేజం అలానే ఉందంటే.. ఆ పార్టీలో నాయకత్వం ఎంత దారుణంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత ఒకసారిగా పార్టీ పరిస్థితి మారిపోయింది. కెసిఆర్ కు సవాల్ కాదు.. కెసిఆర్ పీఠాన్ని పక్కకు జరిపి చూపించాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డికి బయట పల్లకి మోత ఉన్నప్పటికీ.. ఇంట్లో మాత్రం ఈగల మోత ఉంది. అదే అతడికి ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది.
మునుగోడు ఉప ఎన్నికల్లో బిజెపి తరఫున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ చేసినప్పుడు ఆయనకు వ్యతిరేకంగా గులాబీ మీడియా బీభత్సంగా కథనాలు ప్రసారం చేసింది. కేవలం బొగ్గు కాంట్రాక్టు కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరారని ఆరోపణలు చేసింది. ఆ విషయాన్ని ఎన్నికలకు ముందు విపరీతంగా ప్రచారం చేసింది. తద్వారా మునుగోడు ఉప ఎన్నికల్లో గులాబీ పార్టీ కమ్యూనిస్టుల సహాయంతో విజయం సాధించింది.
నాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా రాసిన నమస్తే తెలంగాణ.. వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేసిన టీ న్యూస్ కు ఇప్పుడు హఠాత్తుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గొప్పవాడిగా మారిపోయాడు. ఆ పత్రికలో.. ఆ చానల్లో రాజగోపాల్ రెడ్డికి విపరీతమైన ప్రయారిటీ లభిస్తుంది. దీనికి ప్రధాన కారణం రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని అతడు పరోక్షంగా విమర్శిస్తూ ఉండడమే.. అందువల్లే ఆ పత్రికకు రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు అత్యంత ఆప్తుడిగా మారిపోయాడు. నమస్తే తెలంగాణ అంటే.. టీ న్యూస్ అంటే మరి ఏదో కాదు.. అవి పరోక్షంగా కేసీఆర్ మానస పుత్రికలు. కెసిఆర్ మానస పుత్రికల లాంటి మీడియాలో వార్తలు వచ్చాయంటే.. కచ్చితంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేసిఆర్ కు ఇప్పుడు అత్యంత ఆప్తుడు.
ఆమధ్య సినీ నటుడు నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్య విడాకుల విషయంలో కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలకు గులాబీ మీడియా విపరీతమైన ప్రయారిటీ ఇచ్చింది. సురేఖ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటూ కథనాలను పబ్లిష్ చేసింది. చివరికి కేటీఆర్ కూడా సురేఖ తీరును తీవ్రంగా తప్పుపట్టారు. సురేఖ కుమార్తె ఇటీవల ముఖ్యమంత్రి మీద విమర్శలు చేయడంతో హఠాత్తుగా గులాబీ మీడియాకు కొండా సురేఖ బీసీ నాయకురాలుగా కనిపిస్తోంది. బీసీ నాయకురాలి మీద కుట్ర అంటూ వార్తలను పబ్లిష్ చేస్తోంది. ద్వంద్వ ప్రమాణాల గులాబీ పాత్రికేయాన్ని బయటపడుతోంది. ఇంత జరుగుతున్నప్పటికీ గులాబీ పార్టీ మీడియా సెల్ఫ్ కుక్ డ్ వార్తల మీద కాంగ్రెస్ శ్రేణులు కౌంటర్ ఇవ్వకపోవడం నిజంగా ఆ పార్టీ భావ దారిద్ర్యం..