KCR: ఇటీవల జగిత్యాలలో సభ నిర్వహించిన తర్వాత.. కొద్దిరోజులపాటు వ్యవసాయ క్షేత్రానికి పరిమితమైన భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ బయటికి వచ్చారు. సోమవారం భారత రాష్ట్ర సమితి వ్యవస్థాపక దినాన్ని పురస్కరించుకొని ఆయన.. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ పార్టీ ప్రక్షాళనకు నడుం బిగించారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే అధికారాన్ని దక్కించుకుంటామని చెబుతున్న కేసీఆర్.. దానికి అనుసరించాల్సిన విధానాలలో ఆయన ఇప్పటినుంచే అమలు చేయాలని పార్టీ కార్యకర్తలకు హిత బోధ చేశారు.
పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర కమిటీ మినహా.. జిల్లా.. ఇతర కమిటీలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసే వారికి మాత్రమే టికెట్లు ఇస్తామని కేసీఆర్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో ముఖం చూసి టికెట్ ఇవ్వడం కుదరదని కేసీఆర్ స్పష్టం చేశారు. కొంతమంది నాయకులలో ఇంకా అహంకారం తగ్గలేదని.. వారు తమ ధోరణి మార్చుకోకపోతే కష్టమని కేసీఆర్ అన్నారు. “అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తామని అనుకున్నాం. పార్లమెంటు ఎన్నికల్లో కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంటామని భావించాం. కానీ ఫలితం వేరే విధంగా వచ్చింది. కొంతమంది నాయకులు ఇంకా అహంకారంతో ఉన్నారు.. వారు తమ ధోరణి మార్చుకోవాలని” కెసిఆర్ సూచించారు.
రాష్ట్ర కమిటీ మాత్రమే మనుగడలో ఉంటుందని ప్రకటించిన కేసీఆర్.. జిల్లాస్థాయి కమిటీలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. త్వరలోనే అన్ని స్థాయిలలో కొత్త కమిటీలను ప్రకటిస్తామని కెసిఆర్ అన్నారు. వారికి శిక్షణ ఇచ్చే బాధ్యతను కేటీఆర్ కు అప్పగించారు. భారత రాష్ట్ర సమితి సభ్యత్వ నమోదును కూడా ప్రారంభించాలని కేసీఆర్ అన్నారు. సభ్యత్వ రుసుము పది రూపాయలుగా ప్రకటించారు. ఆన్లైన్లో.. ఆఫ్లైన్లో సభ్యత్వ నమోదు చేపట్టాలని కెసిఆర్ ఆదేశించారు.
ఇటీవల కవిత టిఆర్ఎస్ పేరుతో కొత్త పార్టీని ప్రకటించిన నేపథ్యంలో.. కెసిఆర్ ఆమె గురించి మాట్లాడలేదు. పార్టీ ఆవిర్భావ సభలో కవిత కెసిఆర్ ను ఉద్దేశించి మారిన మనిషి.. మర మనిషి అని వ్యాఖ్యానించారు. అంతేకాదు కేసీఆర్ చుట్టూ పందికొక్కులు ఉన్నాయని ఆరోపించారు. అయితే కవిత పార్టీ ఆవిర్భావ సభ తర్వాత.. భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా హ్యాండిల్ లో డూప్లికేట్ ఒరిజినల్ అంటూ ఒక పోస్ట్ చేసింది. ఆ తర్వాత పార్టీ కార్యకర్తలను కవిత పార్టీ ఏర్పాటు మీద ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదని భారత రాష్ట్ర సమితి అధినాయకత్వం సూచించింది. ఈ నేపథ్యంలో ఉన్న కేసీఆర్ కూడా కవిత పార్టీ పట్ల ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని తెలుస్తోంది.
