New Ration Cards: తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో వంద రోజులు పూర్తిచేసుకుంది. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ప్రకటించింది. కానీ, ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీ, మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్ సిలిండర్ మాత్రమే అందిస్తోంది. ఈ పథకాలన్నీ రేషన్ కార్డు ఉన్నవారికే అందిస్తోంది. దీంతో అర్హత ఉండి రేషన్ కార్డు లేనివారు నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రేవంత్ సర్కార్ పేదలకు కొత్త రేషన్కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది.
లక్షల మంది ఎదురు చూపు..
రాష్ట్రంలో ప్రస్తుతం 92 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. అయినా లక్షల మంది కొత్త కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ పథకాలకు రేషన్కార్డు తప్పనిసరి కావడంతో చాలా మంది కార్డు కావాలని కోరుకుంటున్నారు. గడిచిన పదేళ్లలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయలేదు. దీంతో కొత్త ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. నాలుగు రోజుల క్రితం జరిగిన కేబినెట్ భేటీలో కొత్త రేషన్ కార్డుల జారీపై నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఎంత మందికి కార్డులు ఇస్తారు. అర్హతలు ఏంటి, ప్రమాణాలు ఎలా నిర్ణయిస్తారు అన్న చర్చ జరుగుతోంది.
కీలక అప్డేట్..
ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం రాష్ట్రంలోని ప్రతీ పేద కుటుంబానికి తెల్ల రేషన్కార్డు అందించాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు, ఆరు గ్యారంటీలకు రేషన్కార్డు తప్పనిసరి అయింది. ఈ నేపథ్యంలో మరింత మంది పేదలకు రేషన్కార్డు ఇచ్చి పథకాలు అందించాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించింది. ఇటీవల ప్రజాపాలన దరఖాస్తుల ద్వారా 20 లక్షల మంది కొత్త రేషన్కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులను స్క్రూటినీ చేసి తర్వాత ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తారని తెలుస్తోంది. అర్హులని నిర్ధారణ చేసిన తర్వాత కార్డులు జారీ చేస్తారని తెలుస్తోంది.
వీరు అనర్హులు..
ఇక ప్రభుత్వ ఉద్యోగులు, సొంత ఇల్లు, కారు ఉన్నవారు, ఇన్కం ట్యాక్స్ చెల్లించేవారికి కొత్త రేషన్కార్డులు ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే అలాంటి అనర్హులు ఉంటే వారి కార్డులను తొలగించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దరఖాస్తుదారు ఆర్థిక స్థితిగతులు, జీవన విధానం పరిశీలించిన తర్వాతే అర్హతను నిర్ణయిస్తారని సమాచారం. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు న్యాయం జరిగేలా రేషన్కార్డుల జారీ ప్రక్రియ చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఈమేరకు అధికారులు ప్రక్రియ వేగవంతం చేశారు. త్వరలోనే కార్డులు జారీ చేసే అవకాశం ఉంది.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read More