HomeతెలంగాణTelangana Weather: ఇక మరింత గజగజ.. మూడు రోజులు జాగ్రత్తగా ఉండాలి.. తెలంగాణకు వాతావరణ శాఖ...

Telangana Weather: ఇక మరింత గజగజ.. మూడు రోజులు జాగ్రత్తగా ఉండాలి.. తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్‌!

Telangana Weather: తెలంగాణలో వాతావరణం వేగంగా మారుతోంది. చలికాలం ప్రారంభం కావడంతో కనిష్ట ఉష్ణోగ్రతలు పది రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. వారం రోజులుగా గణనీయంగా పడిపోతున్నాయి. సాయంత్రం 5 గంటల నుంచే చలి ప్రభావం మొదలవుతుంది. ఉదయం 9 గంటల వరకు పొగ మంచు కురుస్తోంది. చల్ల గాలులు వీస్తున్నాయి. ఫలితంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఆస్తమా ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రాబోయే మూడు రోజులు మరింత జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈమేరకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని తెలిపింది.

10 డిగ్రీలకన్నా తక్కువగా..
తెలంగాణలోని చాలా జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలకన్నా తక్కువగా నమోదవుతున్నాయి. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 9 డిగ్రీల సెల్సియస్‌ కన్నా తగ్గుతాయని వెల్లడించింది. ఆదివారం ఆదిలాబాద్‌లో 9.5 డిగ్రీల సెల్సియస్, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌లో 9.4 డిగ్రీల సెల్సియస్‌గా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

జాగ్రత్తగా ఉండాలి..
చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖతోపాటు, వైద్యులు కూడా హెచ్చరిస్తున్నారు. రాత్రి పూట ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచిస్తున్నారు. వృద్ధులు, చిన్న పిల్లలు బయటకు రాకపోవడమే మంచిదని అంటున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు అస్సలు బయటకు రావొద్దని పేర్కొంటున్నారు. వాతావరణం మారుతున్న నేపథ్యంలో ఇన్‌ఫ్లూయెంజా పంజా విసిరే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులు ఉంటాయని తెలిపారు. చిన్న పిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంటున్నారు.

వైద్యుల సలహాలు..
వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు జాగ్రత్తగా ఉండాలి.
చలి ఎక్కువగా ఉండే సమయంలో ఇంట్లో నుంచి బయటక రావొద్దు.
శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచేలా ఉన్ని వస్త్రాలు ధరించాలి.
వేడి పదార్థాలు ఆహారంగా తీసుకోవాలి. కాచిన నీటినే తాగాలి. కూల్‌ డ్రింక్స్‌ జోలికి వెళ్లొద్దు.
ముదురు రంగు దుస్తులనే ధరించాలి.
అనారోగ్యంగా ఉన్నవారితో సన్నిహితంగా ఉండొద్దు.
నీరు ఎక్కువగా తాగాలి, సరైన నిద్రపోవాలి.
పిల్లలు, వృద్ధులు రాత్రి బయటకు రావొద్దు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular