Bandla Ganesh : పైకి తెలంగాణ వాదాన్ని గొప్పగా ప్రచారం చేసుకుంటుంది గాని.. వాస్తవానికి భారత రాష్ట్ర సమితి ఎప్పుడో రాజకీయ పార్టీగా మారిపోయింది. ఈ విషయాన్ని కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. కాకపోతే తెలంగాణ వాదం లేకుంటే భారత రాష్ట్ర సమితికి మనుగడలేదు. ఎందుకంటే భారత రాష్ట్ర సమితి అధినేత తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీలో చక్రాలు తిప్పాలని గట్టిగా అనుకున్నారు. ఢిల్లీలో భారత రాష్ట్ర సమితికి కార్యాలయం కూడా కట్టించారు. పంజాబ్ నుంచి మొదలుపెడితే ఉత్తరప్రదేశ్ వరకు గాలి మోటర్ వేసుకొని తిరిగారు. కానీ 2023 ఎన్నికల్లో వాస్తవం తెలిసి ఇప్పుడు వ్యవసాయ క్షేత్రానికి పరిమితమయ్యారు.
ఆ మధ్య తోట చంద్రశేఖర్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి భారత రాష్ట్ర సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించారు. చాలామందిని చేర్చుకుంటున్నట్టు ప్రకటించారు. కానీ ఏపీలో భారత రాష్ట్ర సమితి పోటీ చేసింది లేదు. ఏపీలో చక్రాలు తిప్పింది లేదు. ఒకరకంగా చెప్పాలంటే అప్పట్లో అధికారంలో ఉన్నప్పుడు దేశంలోనే చక్రాలు తిప్పుతానని కేసీఆర్ కలలు కన్నారు. ఆ కలలు అలానే మిగిలిపోయాయి. చివరికి తెలంగాణ ప్రజల పన్ను పైసలను తన పార్టీ కోసం పనిచేసిన కొంతమందికి అప్పటి భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ఖర్చు పెట్టింది. దీనిని వ్యతిరేకించిన వారిని తీవ్రంగా సొంత మీడియాలో దూషించింది కూడా.
ఇప్పుడు అధికారం పోయింది . పార్లమెంటు ఎన్నికల్లో 0 ఫలితం వచ్చింది.. ఉప ఎన్నికల్లో కూడా దిమ్మతిరిగే రిజల్టు వచ్చింది. సోషల్ మీడియాలో బలంగా ఉంది గాని.. ఫీల్డ్ లెవల్లో ఆ పార్టీకి ఇప్పట్లో అంత సన్నివేశం కనిపించడం లేదు. ఇలాగే ఉంటే పరిస్థితి దారుణంగా మారుతుంది. అందువల్లే భారత రాష్ట్ర సమితి అధినాయకత్వం ఇప్పుడు కొన్ని మార్పులకు శ్రీకర చుట్టినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కొంతమంది నాయకులను ఆహ్వానించాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. అందులో ప్రముఖ సినీ నిర్మాత.. పౌల్ట్రీ వ్యాపారవేత్త బండ్ల గణేష్ ఉన్నట్టు సమాచారం. బండ గణేష్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన వ్యక్తిగా ఉన్నారు. అయితే ఈయనను భారత రాష్ట్ర సమితిలో ఆహ్వానించి.. జూబ్లీహిల్స్ స్థానం నుంచి పోటీ చేయించాలని గులాబీ పార్టీ భావిస్తోంది. ఈ క్రమంలోనే బండ గణేష్ కు వర్తమానం పంపినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై బండ్ల గణేష్ ఇప్పటివరకు ఏం నిర్ణయం తీసుకోలేదు.. పైగా బండ్ల గణేష్ ఆర్థికంగా స్థితిమంతుడు. గట్టిగా ఖర్చు పెట్టగలడు. అవసరమైతే పార్టీ కోసం కూడా సహాయం చేయగలడు. ఇప్పుడు భారత రాష్ట్ర సమితికి కావలసింది అదే. అందువల్లే రావయ్య గణేష్ అంటూ ఆహ్వానం పలుకుతోంది. మరి ఈ పవన్ కళ్యాణ్ భక్తుడు ఏం చేస్తారు.. గులాబీ కండువా కప్పుకుంటారా.. వచ్చే ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేస్తారా.. ఈ ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది.
ఇటీవల బండ్ల గణేష్ తన కుమార్తె జనని వివాహం చేశారు. ఆ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆ కార్యక్రమానికి భారత రాష్ట్ర సమితిలో ఉన్న కీలక నాయకులు హాజరయ్యారు. పేరుకు కాంగ్రెస్ నాయకుడు అయినప్పటికీ వ్యక్తిగత సంబంధాలను కొనసాగించడంలో బండ్ల గణేష్ తర్వాతే ఎవరైనా. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను.. తన కుమార్తె వివాహ వేడుకకు హాజరయ్యేలా చూసుకున్నారు బండ్ల గణేష్. దీనిని బట్టి అతని స్ట్రాటజీ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఏకంగా ముఖ్యమంత్రులను కలిసే స్టామినా ఉన్న బండ్ల గణేష్.. గులాబీ పార్టీలో ఉండగలుగుతారా.. కెసిఆర్ చెప్పినట్టు వినగలుగుతారా.. కేటీఆర్ సూచనలకు తల వంచుతారా.. అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలని విశ్లేషకులు అంటున్నారు.