Team India: అవి టెంట్లు.. అక్కడ డ్రెస్సింగ్ రూమ్ లు ఏర్పాటు చేశారు. అందులో జెర్సీలు మార్చుకోవాలట.. ఆ రూమ్ కి ఒక 500 మీటర్ల దూరంలో వాష్ రూమ్ లు ఏర్పాటు చేశారు.. అందులో ఆ పని కానివ్వలట. ఇదేదో డొమెస్టిక్ క్రికెట్ కోసం చేసిన ఏర్పాట్లు కావు. ఒక సాధారణ టోర్నీ కోసం కల్పించిన సౌకర్యాలు కావు. ఇటువంటి అసౌకర్యాల మధ్య టీమ్ ఇండియా ఆటగాళ్లు ఆడాలి.
చదువుతుంటే ఆశ్చర్యం అనిపించినప్పటికీ.. ఇది ముమ్మాటికి నిజం. పైగా టీమిండియా ప్లేయర్ల మీద ఇలాంటి వైఖరి ప్రదర్శిస్తున్న ఆ మేనేజ్మెంట్ మరెవరో కాదు జపాన్.. జపాన్ దేశంలో ఆసియా గేమ్స్ నిర్వహించబోతున్నారు. ఆసియా గేమ్స్ లో భాగంగా క్రికెట్ టోర్నీ కూడా నిర్వహిస్తున్నారు. ఈ టోర్నీలో ఆటగాళ్లకు కల్పించిన సౌకర్యాల మీద తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ టోర్నీ ఏర్పాట్ల మీద ఆటగాళ్లు మాత్రమే కాదు టీమ్ ఇండియా క్రికెట్ మేనేజ్మెంట్ కూడా తీవ్రస్థాయిలో అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం.
డ్రెస్సింగ్ రూమ్ లను టెంట్ల కింద ఏర్పాటు చేశారు. వాటికి 500 మీటర్ల దూరంలో వాష్ రూమ్ లు ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని జపాన్ ఒలంపిక్స్ అధికారులు గర్వకారణంగా చెబుతున్నారు. అయితే ప్లేయర్లను ఇలా ట్రీట్ చేయడం పట్ల భారత్ క్రికెట్ సంఘం అధికారులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏర్పాట్లలో ఏమాత్రం తేడా ఉన్నా సరే తీవ్రంగా పరిణామాలు ఉంటాయని భారత క్రికెట్ సంఘం ప్రతినిధులు చెబుతున్నారు. ఒకవేళ జపాన్ వైఖరి గనుక మారకపోతే భారత దేశం నుంచి బి క్రికెట్ జట్టును పంపిస్తామని ఇప్పటికే మేనేజ్మెంట్ హెచ్చరించింది. అంతేకాదు ఏర్పాట్లను పర్యవేక్షించడానికి ఒక అబ్జర్వర్ ను కూడా పంపిస్తామని పేర్కొంది.
“ఏర్పాట్లు ఏమాత్రం బాగోలేదు. ఆటగాళ్లకు ఈ స్థాయిలో సౌకర్యాలు కల్పిస్తే ఎలా ఆడతారు.. కాస్తయినా తెలివి ఉండాలి కదా.. అలా కాకుండా ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటే ప్లేయర్లు ఏమైపోవాలి. ఇలాంటి బి గ్రేడ్ స్థాయి సౌకర్యాలు ఉన్నచోట ఆటగాళ్లను అక్కడికి పంపించే అవకాశం లేదు. ఒకవేళ అంతకి తప్పదు అనుకుంటే బి జట్టును పంపించాల్సి ఉంటుందని భారత క్రికెట్ సంఘం ప్రతినిధులు స్పష్టం చేసినట్టు” జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఆసియా గేమ్స్ లో చాలా సంవత్సరాల తర్వాత క్రికెట్ కు చోటు కల్పించారు. ఈ క్రీడల్లో తిరుగులేని స్థాయిని ప్రదర్శించాలని భారత క్రికెట్ జట్టు భావిస్తోంది. తద్వారా క్రికెట్ విస్తృతిని పెంచాలని నిర్ణయించింది. కానీ, ఆసియా క్రీడల నిర్వాహకులు మాత్రం దారుణంగా ప్రవర్తిస్తున్నారు. సౌకర్యాల విషయంలో నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారు. వారి చర్యల వల్ల క్రికెటర్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కనీసం డ్రెస్సులు మార్చుకునే అవకాశం కూడా సరిగా లేకపోతే ఆటగాళ్లు ఆట మీద ఎలా మనసు లగ్నం చేస్తారని విశ్లేషకులు అంటున్నారు. చివరికి ఎక్కడో దూరంగా వాష్ రూమ్ లు ఉంటే.. ఆటగాళ్లు అత్యవసర సమయాల్లో వాటిని ఎలా వినియోగించుకుంటారని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఆసియా క్రీడలు నిర్వహించే వ్యక్తులు తమ ధోరణి మార్చుకోవాలని.. సౌకర్యాల కల్పన మీద దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.