Sanju Samson
Sanju Samson: టీమిండియా జట్టులో కీలకమైన ప్లేయర్ గా ఎదిగేందుకు అవసరమైన శక్తి, సామర్థ్యాలు, నైపుణ్యం అపారంగా ఉన్నప్పటికీ.. అదృష్టం కలిసి రాకపోవడంతో జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకోలేకపోతున్నాడు యువ ప్లేయర్ సంజూ శాంసన్. ఒంటి చేత్తో మ్యాచ్ ను మలుపు తిప్పగల సామర్థ్యం ఈ యంగ్ బ్యాటర్ సొంతం. అయితే ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడం, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోవడంతో.. జట్టులోకి రావడం, పోవడం పరిపాటిగా మారింది. తాజాగా వెస్టిండీస్ పర్యటనకు వెళుతున్న భారత జట్టుకు ఎంపికయ్యాడు శాంసన్. సుమారు ఏడు నెలల తర్వాత భారత జట్టులోకి ఎంట్రీ ఇస్తున్నాడు.
టీమిండియాలో అత్యంత ప్రతిభ కలిగిన యువ క్రికెటర్లలో చెప్పుకోదగిన పేర్లలో తప్పనిసరిగా ఉండే పేరు సంజు శాంసన్. అద్వితీయమైన ఆటతీరుతో అదరగొడుతుంటాడు ఈ యువ ప్లేయర్. ఐపీఎల్ వంటి లీగుల్లో విజృంభించే ఆడే శాంసన్ అంతర్జాతీయ క్రికెట్ లో మాత్రం ఆ స్థాయిలో రాణించలేకపోతున్నాడు. దీనికి ప్రధాన కారణం ఎక్కువ అవకాశాలు లేకపోవడమే అన్న విమర్శ ఉంది. అయితే వచ్చిన అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకో లేకపోవడంతో సమస్య ఉత్పన్నమవుతుంది. అయితే వచ్చే నెలలో వెస్టిండీస్ పర్యటనకు వెళుతున్న భారత జట్టులో సభ్యుడిగా ఎంపికయ్యాడు శాంసన్. ఏడు నెలల తర్వాత భారత జట్టు తరఫున బరిలోకి దిగబోతున్న శాంసన్ ఇప్పుడైనా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అభిమానులు కోరుతున్నారు.
11 వన్డేల్లో టీమిండియా ప్రాతినిధ్యం..
సంజూ శాంసన్ ఇప్పటి వరకు భారత జట్టు తరఫున 11 వన్డేలు ఆడాడు. పది ఇన్నింగ్స్ ల్లో 330 పరుగులు చేశాడు. 66 సగటుతో ఈ పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 86 పరుగులు కాగా ఇందులో రెండు అర్థ సెంచరీలు కూడా ఉన్నాయి. అలాగే ఇప్పటి వరకు 17 టీ20లు ఆడిన సంజూ శాంసన్ 20.7 సగటుతో 31 పరుగులు చేశాడు. ఇందులో ఒక అర్థ సెంచరీ మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో గత కొన్ని నుంచి భారత క్రికెట్ జట్టుకు సంజూ శాంసన్ ఎంపిక కాలేదు. తాజాగా వెస్టిండీస్ పర్యటనకు సంజూ శాంసన్ ఎంపిక కావడంతో అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
సత్తా చాటాల్సిన అవసరం..
సంజూ శాంసన్ ను వెస్టిండీస్ పర్యటనలో భాగంగా వన్డే తో పాటు టి20 ఫార్మాట్ కు ఎంపిక చేశారు. మూడు వన్డేలు, ఐదు టి20 మ్యాచ్ లు ఈ పర్యటనలో భాగంగా భారత జట్టు ఆడనుంది. ఈ పర్యటనకు ఎంపికైన జట్టును పరిశీలిస్తే దాదాపుగా సంజూ శాంసన్ కు తుది జట్టులో చోటు లభించే అవకాశం కనిపిస్తోంది. తుది జట్టులో చోటు దక్కితే మాత్రం తనలోని ప్రతిభను బయటకు తీసి సత్తాను చాటాల్సిన అవసరం సంజూ శాంసన్ కు ఏర్పడింది. ఈ సిరీస్ లో అదరగొడితే అక్టోబర్ లో జరగనున్న వన్డే వరల్డ్ కప్ కు రోడ్ క్లియర్ అయ్యే అవకాశం ఉందని క్రికెట్ నిపుణులు చెబుతున్నారు.