Hyderabad Cricket Association: హైదరాబాద్ క్రికెట్ సంఘం ఒకప్పుడు బీసీసీఐకి కూడా తలమానికంగా ఉండేది. హైదరాబాద్ క్రికెట్ సంఘంలో పనిచేసినవారు ఇక్కడి నుంచే భారత క్రికెట్ నియంత్రణ మండలి శాసించేవారు. హైదరాబాద్ క్రికెట్ స్టేడియం లో అంతర్జాతీయ నుంచి మొదలుపెడితే జాతీయ వరకు ఎన్నో మ్యాచ్ లు నిర్వహించేవారు. తద్వారా హైదరాబాద్ క్రికెట్ కు కొత్త సొబగులు అద్దే వారు.
ఇప్పుడు హైదరాబాద్ క్రికెట్ సంఘం పరిస్థితి దారుణంగా మారిపోయింది. ఆర్థికంగా అవకతవకలు.. సంఘంలో ఉన్న వ్యక్తుల ఇష్టారాజ్యం.. ఐపీఎల్ సమయంలో టికెట్ల కేటాయింపులో రాజకీయం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. చివరికి ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు స్టేడియంలో కనీస సౌకర్యాలను హైదరాబాద్ క్రికెట్ సంఘం ఏర్పాటు చేయలేకపోతోంది. ఈ క్రమంలో గాడి తప్పిన హైదరాబాద్ క్రికెట్ సంఘానికి సరికొత్త రూపు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జస్టిస్ నవీన్ రావు నేతృత్వంలో ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది.
నవీన్ రావు ఆధ్వర్యంలోని ఏకసభ్య కమిటీ పర్యవేక్షణలో కీలక నిర్ణయం తీసుకుంది.. హైదరాబాద్ క్రికెట్ సంఘంలో పాలనను మెరుగుపరచడంతో పాటు.. పారదర్శకత తీసుకొచ్చేందుకు అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ క్రికెట్ సంఘం పరిధిలో క్రికెట్ అభివృద్ధికి.. ఆటలో ప్రమాణాల పెంపునకు ప్రణాళిక రూపొందించింది.. ఈ నేపథ్యంలో హైదరాబాద్ క్రికెట్ ఆపరేషన్ హెడ్ గా భారత జాతీయ క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు అంబటి రాయుడిని నియమించింది. రాయుడి ద్వారా హైదరాబాద్ క్రికెట్ సంఘానికి పూర్వ వైభవం వస్తుందని అపెక్స్ కౌన్సిల్ భావిస్తోంది. మూడు సంవత్సరాల పాటు రాయుడు ఈ పదవిలో ఉంటారు. హైదరాబాద్ క్రికెట్ సంఘం నుంచి ఆయనకు ఎటువంటి ఆర్థిక ప్రయోజనాలు లభించవు. ఆ ఒప్పందం మీద ఆయన సంతకం చేశారు. మంగళవారం బాధ్యతలు కూడా స్వీకరించారు. ఆటగాళ్లకు ట్రైనింగ్, సెలక్షన్, ప్లేయర్ల అన్వేషణ.. ఇవన్నీ కూడా ఆయన చూసుకుంటారు. హైదరాబాద్ క్రికెట్ సంఘము అధ్యక్షుడు అమర్నాథ్, కార్యదర్శి జీవన్ రెడ్డి ఇప్పటికే ఆయనతో మాట్లాడారు.
హైదరాబాద్ క్రికెట్ సంఘంలో అవినీతి నిరోధక యూనిట్, ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేస్తామని రాయుడు ప్రకటించారు. ప్లేయర్లు లేదా ఇంకెవరైనా టోల్ ఫ్రీ నెంబర్, ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని రాయుడు వెల్లడించారు. దోషిగా తేలిన వారిపట్ల కఠిన చర్యలు తీసుకుంటామని రాయుడు హెచ్చరించారు. ముంబై క్రికెట్ సంఘం ఇటీవల ఆటగాళ్ల కాంట్రాక్ట్ విధానాన్ని ప్రకటించింది. దీనిని హైదరాబాద్ క్రికెట్ సంఘంలో అమలులోకి తెచ్చే ఆలోచనలో ఉన్నారు రాయుడు. సరైన వ్యక్తులను సెలక్షన్ కమిటీలో నియమించి.. వారు సూచించిన ప్లేయర్లను మాత్రమే ఎంపిక చేస్తారు.
ఈ ఎంపిక ప్రతిభ ఆధారంగానే ఉంటుంది. లీగ్ మ్యాచ్లలో చూపించిన ప్రతిభ ఆధారంగా ఇంతకుముందు ప్లేయర్లను ఎంపిక చేసేవారు. ఇప్పుడు ఓపెన్ ట్రయల్స్ ద్వారా ప్లేయర్లను ఎంపిక చేస్తారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కు అనుగుణంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఏర్పాటు చేయబోతున్నారు. అంతేకాదు జిల్లాల క్రికెటర్ల మీద ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు. మరోవైపు అవినీతి నిరోధక యూనిట్ కు మాజీ జడ్జీ విజేందర్ చైర్మన్ గా ఉంటారు. అదే కాదు మహిళా క్రికెటర్లు.. ఇతర సిబ్బందికి అనుకూలమైన వాతావరణం ముంచేందుకు ఏకంగా పోష్ కమిటీ కూడా ఏర్పాటు చేస్తారు.