Chief Ministers Defeat: ఇటీవల ఎన్నికల ఫలితాల్లో చాలా విచిత్రకర పరిస్థితులు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యమంత్రులు కూడా ఎన్నికల్లో ఓడిపోయారు. తమిళనాడులో సీఎం గా ఉన్న స్టాలిన్ ఓడిపోయారు. పశ్చిమ బెంగాల్ సీఎం గా ఉన్న మమతా బెనర్జీ కూడా ఓడిపోయారు. 2021 ఎన్నికల్లో కూడా మమత ఓడిపోయారు కానీ.. అప్పట్లో పార్టీ అధికారంలోకి రావడంతో ఉప ఎన్నికలకు వెళ్లి.. ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదు. ఇక తమిళనాడులో స్టాలిన్ అయితే టీవీకే అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. అయితే ఇప్పుడు ఏపీలో దీనిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. 2029 ఎన్నికల్లో కుప్పం తో పాటు పులివెందుల నియోజకవర్గాలు కూడా ప్రతిష్టాత్మకంగా మారుతాయి. అదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం, లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి కూడా హాట్ టాపిక్ గా నిలవనున్నాయి. దానికి కారణం ఎన్నికల్లో ప్రముఖులు ఓడిపోతుండడమే. ఈ ట్రెండ్ ను అనుసరించి కచ్చితంగా ప్రత్యర్ధులు ఓడించేందుకు ప్రయత్నాలు చేస్తారు. ఏపీలో అయితే ఇది మరింత ఎక్కువగా ఉంటుంది.
* ప్రత్యర్థులపై ఫోకస్..
తమ రాజకీయ ప్రత్యర్థులు చట్టసభలకు రాకూడదు అని పంతం పట్టే రోజులు ఇవి. అందులోనూ ఏపీలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. 2019 ఎన్నికల్లో అయితే చంద్రబాబు ఓడిపోయేసరికి.. కుప్పం పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి. ఆ బాధ్యతలను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు. అక్కడ టిడిపి నేతలను ప్రలోభ పెట్టి వైసిపిలో చేర్పించారు. ఓ యువ నాయకుడికి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టి ఫుల్ పవర్స్ ఇచ్చారు. అసలు కుప్పంలో చంద్రబాబు పర్యటించకుండా కూడా అప్పట్లో అడ్డుకున్నారు. ఎలాగైనా చంద్రబాబును 2024లో ఓడించాలన్నది అప్పట్లో వ్యూహం. ఎందుకంటే 2019 ఎన్నికల్లో చంద్రబాబుకు పూర్తిగా మెజారిటీ తగ్గింది. అందుకే ఈసారి అక్కడ గెలిచి చంద్రబాబును అసెంబ్లీలోకి రానీయకుండా చేయాలన్నది జగన్మోహన్ రెడ్డి ప్రణాళిక. కానీ అది వికటించింది. చంద్రబాబు భారీ మెజారిటీతో గెలవడమే కాదు.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కూడా.
* పిఠాపురం పై రాయలసీమ నేతలు
మరోవైపు పిఠాపురం నియోజకవర్గం పై కూడా జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టారు. అంతకుముందు ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసిన పవన్ ఓడిపోయారు. మరోసారి అదే పరిస్థితి రాకుండా చేయాలని జగన్ చేయని ప్రయత్నం అంటూ లేదు. చంద్రబాబు నియోజకవర్గాన్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి అప్పగిస్తే.. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఓటమి కోసం పెద్దిరెడ్డి మిధున్ రెడ్డిని ప్రయోగించారు జగన్మోహన్ రెడ్డి. అప్పట్లో రాయలసీమ నుంచి తనను ఓడించేందుకు రౌడీలమూక వచ్చింది అంటూ పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో వైసీపీ చేసిన ప్రయత్నం పిఠాపురం లో కూడా వికటించింది. పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలిచారు. మంగళగిరిలో కూడా లోకేష్ ను ఓడించేందుకు శతవిధాల ప్రయత్నం చేశారు జగన్. అక్కడ కూడా వర్కౌట్ కాలేదు. అయితే ఇప్పుడు తమిళనాడుతో పాటు పశ్చిమ బెంగాల్లో సీఎంలు ఓడిపోవడంతో.. ఏపీలో ఆ పరిస్థితి ఉంటుందా అనే చర్చ జరుగుతోంది. అయితే గతంలోనే జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇప్పుడు ఎంత మాత్రం వర్కౌట్ కావు అనేది విశ్లేషకుల మాట.