తెలుగు మాసాలలో ఎంతో పవిత్రంగా భావించే మాసాలలో శ్రావణమాసం ఒకటి. శ్రావణమాసంలో మహిళలు పెద్ద ఎత్తున ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. అదే విధంగా వివిధ రకాల నోములు, వ్రతాలు చేస్తుంటారు. ముఖ్యంగా శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఎంతో ముఖ్యమైనది. వరలక్ష్మీ వ్రతంతో పాటు శ్రావణ మాసంలో మంగళగౌరీ వ్రతాన్ని కూడా పెద్ద ఎత్తున చేస్తుంటారు. ఈ మంగళ గౌరీ వ్రతాన్ని శ్రావణ మాసం మంగళవార వ్రతం అని కూడా పిలుస్తారు. ఎంతో పవిత్రమైన ఈ మంగళ గౌరీ వ్రతం ఎలా చేయాలి? ఈ వ్రతం యొక్క విశిష్టత ఏమిటి? అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం… మంగళగౌరీ వ్రతాన్ని శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళ వారాలలో చేస్తారు. మంగళగౌరీ వ్రతాన్ని పెళ్లైన స్త్రీలు మాత్రమే చేయాలి. మంగళగౌరీ వ్రతం చేయడం ద్వారా తమ పసుపు కుంకుమలు పదికాలాలపాటు చల్లగా ఉంటాయని మహిళలు భావిస్తారు. మహిళలు మంగళ గౌరీ వ్రతాన్ని ఐదు సంవత్సరాలు చేయాలి. పెళ్లయిన మొదటి ఏడాది పుట్టింటిలో మంగళగౌరీ వ్రతం చేస్తే ఆ తర్వాత నాలుగు సంవత్సరాలు అత్తవారింట్లో చేస్తారు.
మంగళగౌరీ వ్రతం ఆచరించే మహిళలు మొదటి ఏడాది ఐదు మంది ముత్తయిదువులు, రెండవ ఏడాది పది మంది మూడవ ఏడాది 15 మంది, నాలుగవ ఏడాది 20 మంది,ఐదవ ఏడాది పాతికమంది ముత్తైదువులను ఇంటికి పిలిచి వారికి పసుపు కుంకుమలను ఇచ్చి తాంబూలంలో సెనగలు, కొబ్బరి,పండును ఇవ్వాలి.
ఈ విధంగా మంగళగౌరీ వ్రతం ఐదు సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాత 33 జతల అరిసెలను ఒక కొత్త కుండలో పెట్టి పైన కొత్త రవికెల గుడ్డ తో కుండకు కట్టి మట్టెలు, మంగళ సూత్రం, గాజులు, పసుపు కుంకుమ వంటి మంగళకరమైన వస్తువులను పెట్టి కొత్త పెళ్ళికూతురుకు వాయనం ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల తమ పసుపు కుంకుమలు చల్లగా ఉంటూ ముత్తయిదుగా కొనసాగుతారు. అయితే ఈ వాయనంలో ఏ విధమైనటువంటి లోపం లేకుండా చూడాలి.ముఖ్యంగా ఈ మంగళ గౌరీ వ్రతాన్ని ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో పెద్ద ఎత్తున నిర్వహిస్తారు.
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read More