Garikapati Narasimha Rao : తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ ప్రవచనకర్తగా పేరుందిన గరికపాటి నరసింహారావు గురించి చాలామందికి తెలిసి ఉంటుంది. తన మాటల ద్వారా ఎంతో మందిని ఆకట్టుకున్న ఆయన వ్యక్తుల జీవిత విశేషాల గురించి ఆకట్టుకునే విధంగా చెబుతూ ఉంటారు. ఒక వ్యక్తి సరైన మార్గంలో వెళ్లేందుకు అవసరమైన సూచనలు అందిస్తూ ఉంటారు. అయితే చాలామంది ఆయన దినచర్య ఏంటో తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన ఉదయం ఎన్ని గంటలకు నిద్ర లేస్తారు? రోజంతా ఏం చేస్తారు? ఎప్పుడు నిద్రిస్తారు? వంటి ఆసక్తి విషయాలను వెల్లడించారు. ఆ వివరాల్లోకి వెళితే..
భాగవతం, రామాయణం, మహాభారతం వంటి ఆధ్యాత్మిక గ్రంథాల ఆధారంగా నేటి సమాజంలో మనిషి ఎలా బతకాలో తన ప్రవచనాల ద్వారా సూచనలు ఇచ్చే గరికపాటి నరసింహారావు దినచర్య ఒక ప్రణాళిక ప్రకారంగా ఉంటుందని ఆయన చెప్పారు. ఉదయం ఆయన 5:20 గంటలకు నిద్రలేస్తారు. రాత్రి 10:30 గంటలకు నిద్రపోతారు. మధ్యాహ్నం గంటపాటు నిద్రిస్తారు. నిద్రపోయే విషయంలో ఈ టైమింగ్స్ లో ఎటువంటి మార్పు ఉండదు. ప్రతిరోజు కచ్చితంగా ఈ సమయంలో నిద్రించే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మనిషికి ఆహారం ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం అన్న విషయాన్ని గరికపాటి అప్పుడప్పుడు చెబుతూ ఉంటారు.
ఎంతోమందికి.. ఎన్నో మాధ్యమాల ద్వారా ప్రవచనాలను అందించిన గరికపాటి వీడియోలను ఆయన కేవలం టీవీల ద్వారానే వీక్షిస్తారు. సోషల్ మీడియా లేదా మొబైల్ ద్వారా అసలు చూడరు.. ఎందుకంటే ఫోన్ చూడడం అంటే ఒక వ్యసనం లాగా భావిస్తున్నట్లు ఆయన చెబుతుంటారు. ఏదైనా ప్రత్యేక కార్యక్రమము ఉంటే తప్ప ఖాళీగా ఉన్న సమయంలో తన ప్రవచనాన్ని టీవీలో వినే ప్రయత్నం చేస్తారు. ఒక ప్రవచన కర్తగా కాకుండా ఒక శ్రోతగా తాను చెప్పే విషయాలు ఎలా ఉన్నాయి అని తెలుసుకునేందుకే ఇలా ప్రత్యేకంగా వినాల్సి వస్తుందని గరికపాటి చెప్పుకొచ్చారు.
ప్రతిరోజు ఆయన ఉదయం 8 గంటల లోపు గాయత్రీ జపం తప్పనిసరిగా చేస్తారు. ఆ తర్వాత ప్రతిరోజు ఒక గంట పాటు గ్రంథ పఠనం చేస్తూ గడుపుతారు. ఇందులో శివపురాణం, విష్ణు పురాణం, అమ్మవారి పురాణం వంటివి ఉంటాయి. పది నిమిషాలపాటు శంకర సాహిత్యం కూడా చదువుతూ ఉంటారు. అయితే ప్రతిరోజు ఈ పది నిమిషాల పాటు సాహిత్యాన్ని చదువుతూ 8 ఏళ్లలో 20వేల పుస్తకాలు పూర్తి చేసినట్లు చెప్పారు. అలాగే ఆయనకు బాగా ఇష్టమైన గ్రంథం యోగ వశిష్ట అని చెప్పుకొచ్చారు. ఈ గ్రంథం ఆయన జీవితాన్ని మార్చినట్లు చెప్పారు.