AP name change controversy: ఇటీవల కేంద్ర ప్రభుత్వం ( central government) కేరళ రాష్ట్రం పేరును మార్చిన సంగతి తెలిసిందే. అక్కడి ప్రజల కోరిక మేరకు కేరళం అని పేరు మార్చారు. దీంతో ఆంధ్ర ప్రదేశ్ పేరును కూడా మార్చాలని డిమాండ్ మొదలైంది. గతంలో ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ గా అవతరించింది. తరువాత తెలుగు నాడుగా మార్చాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. అయితే ఇప్పుడు కేరళ పేరు మార్పుతో తెలుగు నాడుగా ఏపీని మార్చాలన్న వాదన వినిపిస్తోంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ పేరు మార్పును ఊరుకోమని మరో వర్గం హెచ్చరిస్తోంది. అయితే తాజాగా ఈ తేనె తుట్టను కదిపారు ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు. గతంలో ఎన్టీ రామారావు ఉమ్మడి ఏపీ ని తెలుగు నాడుగా మార్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
గరికపాటి సూచన..
ప్రముఖ ప్రవచన కర్తగా ఉన్నారు గరికపాటి నరసింహారావు(Garikapati Narasimha Rao ). ఆధ్యాత్మికతతో పాటు చరిత్రను గుర్తుచేస్తూ ప్రవచనాలు చెబుతుంటారు. ఈ నేపథ్యంలో గతంలో ఏపీని తెలుగు నాడుగా మార్చేందుకు ఎన్టీఆర్ చేసిన ప్రయత్నాన్ని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ అనేది తెలుగు పదం కాదని.. ఆంధ్రప్రదేశ్ పేరులో తెలుగుదనం లేదు అని తేల్చేశారు. కేరళ వారికి ఉన్న పట్టుదల కూడా మనకు లేదని.. కేరళ ను కేరళంగా మార్చినట్టే.. ఆంధ్రప్రదేశ్ పేరును తెలుగు నాడుగా మార్చాలని గరికపాటి కోరారు. దీంతో ఆంధ్ర ప్రదేశ్ పేరు మార్పు పై చర్చ మొదలైంది.
Also Read: తమిళ రాజకీయాల్లోకి రోజా?!
స్వామీజీ ఆగ్రహం..
ఇదే అంశంపై భువనేశ్వరి పీఠాధిపతి స్వామి కమలానంద భారతి(Swami kamalananda Bharati ) స్పందించారు. ఈ కొత్త చర్చ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు కాదా? రామాయణ కాలం నుంచి ఆంధ్రా అనే పదం ఉందంటూ ఆయన గరికపాటికి కౌంటర్ ఇచ్చారు. అడిగేవాళ్లు లేరని అధిక ప్రసంగాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. అంతటితో ఆగకుండా వింత పోకడలు, ఇంత ఆలోచనలు మంచిది కాదని.. తెలుగు నాడు అని మార్చినా ఎటువంటి సెంటిమెంటు ఉండదని.. ఇలాంటి మేధావులే ఏపీకి మద్రాస్ రాకుండా చేశారని విమర్శించారు. గరికపాటి తెలంగాణలో స్థిరపడ్డారని.. మా బ్రతుకులు ఎలా ఉండాలో మాకు తెలుసు అంటూ చురకలు అంటించారు. ఇప్పుడు వీరి మధ్య జరిగిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.