ఉపాధి కోసం సొంత ఊరు వదిలి విదేశం వెళ్లిన వలస కార్మికుల వేదన ఇప్పుడు వర్ణనాతీతం. దేశం కాని దేశంలో పనిలేక పరాయి పంచన ఉండలేక వలస కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి కోసం వలస వెళ్లిన వారిని కరోనా మహమ్మారి పట్టి పీడిస్తోంది.
తాజాగా దుబాయి నుండి వలస కార్మికులు పంపిన ఒక వీడియో రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అంజుమాన్ క్యాంపులో ఉన్న తెలంగాణ వారికి కరోనా సోకిందని ఆ వీడియోలో తెలిపారు. బెల్ హసా కంపెనీలో వలస కార్మికులుగా తెలంగాణ, కేరళ, పాకిస్తాన్ కు చెందినవారు పని చేస్తున్నారు.
రాష్ట్రంలోని నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్ జిల్లాకు చెందినవారు 80 మంది అక్కడ పని చేస్తున్నారు. ఇటీవల నిర్వహించిన కరోనా పరీక్షల్లో కేరళలోని మలబార్ కు చెందిన వారితో పాటు తెలంగాణలోని నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల జిల్లాలకు చెందిన 10 మందికి కొవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు సమాచారం. వారిని అంజుమాన్ ప్రాంతంలోని కార్మికుల క్యాంప్ లో రెండు గదులకు (హోం క్వారంటైన్) పరిమితి చేసింది యజమాన్యం. వారికి పాజిటివ్ అని నిర్ధారణ అయిన తరువాత వారిని ఇతర కార్మికులు ఉపయోగించే కిచెన్, బాత్రూమ్లను వాడుకునేలా చేసింది. అయితే, మిగిలినవారికి కరోనా పరీక్షలు నిర్వహించలేదని వారు వాట్సప్ ద్వారా సమాచారాన్ని పంపారు.
పనులు చేస్తేనే పరీక్షలు నిర్వహిస్తామని కంపెనీ పేచీ పెట్టిందని బాధితులు వీడియోలో వాపోతున్నారు. క్యాంప్ లో ఇరుకు గదుల్లో ఉన్న మిగిలినవారి పరిస్థితి దారుణంగా ఉందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని విదేశాంగ శాఖ ద్వారా తమను అదుకోవాలని కోరుతూ బాధితులు అక్కడ నెలకొన్న పరిస్థితిని వీడియో తీసి పంపించారు.